ఎన్నికల బరిలో నందమూరి వారసులు - చంద్రబాబు మొగ్గు ఎవరివైపు..!?
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. టీడీపీ - వైసీపీ గెలుపు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ పైన విజయంతో పాటుగా వైసీపీలో కొందరు నేతలను ఈ సారి ప్రత్యేకంగా టీడీపీ టార్గెట్ చేస్తోంది. జనసేనతో టీడీపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఎవరికి సీట్లు వస్తాయి..ఎవరి సీట్లను జనసేనకు కేటాయిస్తారనే డైలమా కొనసాగుతోంది. ఇదే సమయంలో నందమూరి వారసులు ఈ సారి ఏపీ నుంచి టీడీపీ అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే దాని పైన నియోజకవర్గాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, నందమూరి వారసుల్లో టికెట్లు దక్కేదెవరికి....
ఆ నియోజకవర్గాలపై టీడీపీ గురి..
రానున్న ఎన్నికల్లో టీడీపీ వైసీపీలో కొందరు నేతల నియోజకవర్గాల పైన గురి పెట్టింది. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలనేది లక్ష్యం. ఇందుకోసం పార్టీ నుంచి సరైన అభ్యర్ధుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం జనసేనతో పొత్తు దాదాపు ఖరారు కావటంతో వీరిపైన జనసేన నుంచి పోటీ చేసే అవకాశాలను పరిగణలోకి తీసుకుంటోంది. గుడివాడ నుంచి కొడాలి నాని పైన పోటీకి ఇప్పటిక టీడీపీ నుంచి పలువురి పేర్లు రేసులోకి వచ్చాయి. కానీ తుది నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా వల్లభేని వంశీ పైన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. ఇక రోజా..పెద్దిరెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా జోగి రమేష్ పైన మాజీ మంత్రి దేవినేని ఉమా బరిలోకి దించుతారా.. పార్టీలోకి చేరికలపైన వేచి చూసి నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
పోటీకి సిద్దమంటున్న నందమూరి వారసులు
ఈ సారి ఎన్నికల్లో నందమూరి వారసులు ఏపీ నుంచి ఎంట్రీ ఇవ్వటానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నందమూరి బాలయ్య హిందూపూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడో సారి అక్కడి నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో నందమూరి తారక్ రత్న, చైతన్య కృష్ణ తో పాటుగా తాజాగా నందమూరి సుహాసిని కూడా పోటీకి సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. సుహాసిని 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని కుకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి సుహాసిని ఏపీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీకి సిద్దంగా ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గన్నవరం నుంచి పోటీ ఖాయమని చెబుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి దేవనేని అవినాశ్ పేరు ఖరారైంది. విజయవాడ నగరంలో ఈ సారి టీడీపీ -జనసేనకు మూడు సీట్లు కీలకంగా మారుతున్నాయి. దీంతో సుహాసిని పోటీకి దిగే అంశం పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది.
టీడీపీ నుంచి పోటీకి ఛాన్స్ దక్కేదెవరికి
నందమూరి వారసులు పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. గుడివాడ నుంచి పోటీ చేసేందుకు తారక్ రత్న, చైతన్య కృష్ణ ఇద్దరూ సిద్దమని చెబుతున్నారు. కానీ, గుడివాడలో కొడాలి నాని బలమైన అభ్యర్ధి. అక్కడ నందమూరి కుటుంబం నుంచి అభ్యర్ధిగా ఖరారు చేస్తే ఎంత వరకు కలిసి వస్తుందనే చర్చలు మొదలయ్యాయి. అక్కడ ఇప్పటికే రావి..రాము ఇద్దరూ సీటు రేసులో పోటీ పడుతున్నారు. ఇప్పుడు జనసేన తో పొత్తు ఖరారు కావటంతో పోటీ మరింత కీలకంగా మారుతోంది. సామాజిక వర్గాల వారీగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికి సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడలో నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని బలం తక్కువ అంచనా వేయటానికి లేదు. దీంతో..ఇప్పుడు నందమూరి వారసులకు ఈ సారి పోటీకి అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి.