తారకరత్న చికిత్సలో కీలక మలుపు
స్కానింగ్ రిపోర్టు ఆధారంగా తారకరత్నను ప్రస్తుతం విదేశాలకు తరలించే పరిస్థితి లేదు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత నెల 27వ తేదీన యువగళం పేరుతో కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. లోకేష్ తోపాటు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులను రప్పించే యోచనలో ఆయన కుటుంబ సభ్యులున్నట్లు తెలుస్తోంది.
తాజాగా తారకరత్నకు ఆసుపత్రి వైద్యులు మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్సను పూర్తిచేశారు. ఎనిమిది రోజులుగా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉంటూ నిత్యం వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెదడుకు శస్త్రచికిత్స చేసిన తర్వాత వచ్చే స్కానింగ్ రిపోర్ట్ ను బట్టి మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. అయితే స్కానింగ్ రిపోర్టు ఆధారంగా తారకరత్నను ప్రస్తుతం విదేశాలకు తరలించే పరిస్థితి లేదు. విదేశీ వైద్యులనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రప్పించే యోచన చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 400 రోజులపాటు 4వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో బాలకృష్ణతోపాటు తారకరత్న, అన్ని జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. కొద్ది దూరం నడిచిన తర్వాత తారకరత్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కారులో కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమికి చికిత్స నందించారు. తర్వాత పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించి 8 రోజులుగా చికిత్సనందిస్తున్నారు.












Click it and Unblock the Notifications