వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు అడ్డులేకుండా పోతోంది. గత రెండు మూడు రోజులుగా స్వల్ప ఉత్పాపతనాలతో ఊగిసలాడిన బంగారం ధరలు.. ఒక్కసారిగా నింగిని తాకాయి. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వ్యాపార రంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుండటంతో పసిడి వైపు పెట్టుబడులు వరదలా పారుతున్నాయి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఆరకపోవడం, రష్యా-ఉక్రెయిన్ నడుమ వివాదం రోజురోజుకూ ముదురుతుండటం మార్కెట్లను కుదిపేస్తోంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే 'సేఫ్ హెవెన్' ఆస్తులపై ఇన్వెస్టర్లు విపరీతంగా మొగ్గు చూపడంతో బంగారం ధర ఒక్కసారిగా రాకెట్లా ఎగబాకింది.
దేశీయ మార్కెట్లోనూ పసిడి మోత మోగింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.430 పెరిగి రూ.15,927 మార్కును తాకగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం గ్రాము రూ.395 ఎగబాకి రూ.14,600 వద్దకు చేరింది. ఇక 18 క్యారెట్ల పసిడి గ్రాముకు రూ.250 పెరిగి రూ.11,946 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారెట్ల పసిడి కొనాలంటే ఏకంగా రూ.43,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. నేటి వెండి ధర సైతం గ్రాము రూ.260 గా నమోదవ్వగా.. కిలో రూ.2,60,000 వద్ద ఉంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం. దీంతో భారీ స్థాయిలో కొనుగోలు చేసే వ్యాపారులు, సామాన్య కస్టమర్లు ధరల తీవ్రత చూసి విస్తుపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇది.. నగరాల వారీగా కొత్త రేట్లు!
మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరలు ఒకే రీతిగా పరుగెడుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.4,300 పెరిగి రూ.1,59,270 వద్ద స్థిరపడింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.3,950 పెరిగి రూ.1,46,000కి చేరగా, 18 క్యారెట్ల రేటు రూ.1,19,460 వద్ద నమోదైంది. పండగలు, వివాహాల సీజన్ ముందర ఈ స్థాయిలో ధరలు ఎగబాకడం కొనుగోలుదారుల బడ్జెట్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
మెట్రో నగరాల్లో పసిడి ప్రభంజనం!
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,59,270 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,46,000 గాను కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప వ్యత్యాసంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,420 టచ్ చేయగా, అహ్మదాబాద్లో రూ.1,59,320 వద్ద వ్యాపారం సాగుతోంది. అంతర్జాతీయ భూగోళంలో శాంతియుత వాతావరణం నెలకొంటే తప్ప పసిడి పరుగుకు బ్రేకులు పడేలా కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.














Click it and Unblock the Notifications