తేల్చుకుందాం రా!: జగన్కు లోకేష్ సవాల్, కెసిఆర్ పైనా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సవాల్ విసిరారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు, మీ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిల హయాంలలో ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో తేల్చేందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.
1994 - 2004 వరకూ తాము అధికారంలో ఉన్నామని, 2004 తర్వాత మీరున్నారని, ఎవరి హయాంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, మీరు సిద్ధమా అన్నారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన టిఎన్ఎస్ఎఫ్ వర్కుషాపులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కెసిఆర్కు బాబు సవాల్ విసిరితే ఫాంహౌస్ నుంచి కూడా బయటకు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, ఉద్యోగాలు ఇవ్వలేని స్థితి అని, విద్యుత్ ఉంటే తప్ప పరిశ్రమలు రావని, అందుకే ఎంతో ప్రయత్నించి ఒక్క తన హయాంలోనే ఐదువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచారన్నారు.
ప్రపంచం అంతా తిరిగి ప్రఖ్యాత ఐటి కంపెనీలను తీసుకు వచ్చారని, లక్షల ఐటి ఉద్యోగాలను కల్పించారన్నారు. వైయస్ వచ్చిన తర్వాత ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో అట్టహాసంగా ప్రచారం చేశారని కానీ, వాటిలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని మండిపడ్డారు.
చంద్రబాబు గెలిస్తే తమ అవినీతి బయటపడుతుందని కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు భయపడుతున్నారని లోకేష్ అన్నారు. జగన్ 32సార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిలు రాలేదని, దీంతో సోనియా గాంధీ కాళ్లబేరానికి వెళ్లి బెయిలు తెచ్చుకున్నారని విమర్శించారు. తెలుగువారి కోసం పనిచేసే నేత కావాలో లేక ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే పరిగెత్తుకొని వెళ్ళే నాయకుడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. జగన్ అవినీతి వల్లే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రాకుండా పోయారన్నారు. విద్యార్థులు, యువత దీనిని అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.












Click it and Unblock the Notifications