చంద్రబాబు బలం ప్రజలే, అరెస్టులు అడ్డుకోలేవు- వన్ ఇండియాతో నారా లోకేశ్..!!
చంద్రబాబు వెనుక యావత్ తెలుగు ప్రజలు నిలిచారని టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ అంటున్నారు. అక్రమ అరెస్ట్ తో చంద్రబాబును బలహీనపర్చాలనే కుట్రలు సాగటం లేదంటున్నారు. వెల్లువెత్తుతున్న ప్రజామద్దతే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. చంద్రబాబు తొలి నుంచి ప్రజల కోసమే తపించారని..ఆ ప్రజలే ఇప్పుడు చంద్రబాబుకు అండగా నిలిచారని వివరించారు. అసలు ఈ కేసుకు..చంద్రబాబుకు సంబంధమే లేదని స్పష్టం చేసారు. చంద్రబాబు కేసు..టీడీపీ భవిష్యత్ పై వన్ ఇండియా తెలుగుతో నారా లోకేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
- ప్రశ్న: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఎలా ఉన్నారు..? ఈ కష్ట సమయాల్లో ఆయన ఇంత బలంగా ఎలా ఉండగలుగుతున్నారు..? చంద్రబాబు తరపున ఎంతమంది లాయర్లున్నారు..?
లోకేష్:చంద్రబాబు బలం నిజాయితీ. సత్యమే జయిస్తుందనే నినాదాన్ని చంద్రబాబు గారు గట్టిగా నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏపీ ప్రజలే ఆయన బలం. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవకే తాను అంకితమవుతారు. కొన్ని లక్షలమంది ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ లేఖలు రాశారు. అదే ఆయన బలం. చంద్రబాబు పోరాటయోధుడు. కచ్చితంగా అన్ని అడ్డంకులను అధిగమించి కడిగిన ముత్యంలా బయటకొస్తారు.

- ప్రశ్న: చంద్రబాబును అరెస్టు చేయాల్సిన కంపల్షన్ సీఎం జగన్కు ఎందుకు ఏర్పడిందంటారు..? కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై విచారణ ఎందుకు చేపట్టారు..?
లోకేష్: ఇలాంటి మంచి ప్రశ్నను సీఎంను అడగాలి. ఏపీలో టీడీపీ విజయం సాధించబోతోందన్న విషయం జగన్కు కూడా తెలుసు. మానసిక రుగ్మతతో ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారంలో ఉన్న సమయంలో అరెస్టు చేశాడు. అంటే వారికి భయం పుట్టుకుంది. టీడీపీ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పథకం, ఏపీ ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తుంది. అంతేకాదు అన్నీ సర్వేలు వచ్చేది టీడీపీనే అని చెబుతున్నాయి. వైసీపీ చేయించుకుంటున్న అంతర్గత సర్వేల్లో కూడా ఇదే అంశం వెలుగు చూసింది. ఇక భయం కాకుండా మరేముంటుంది.
సీఎం జగన్కు తెలుసు తన పనైపోయిందని. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. నేరాలు పెరిగాయి, అవినీతి పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది. యువతకు ఉద్యోగాలు లేవు. ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూసేందుకు భయపడుతున్నారు. ఈ అంశాలన్నిటినీ నేను నా యువగళం పాదయాత్రలో ప్రస్తావిస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యం జగన్ ప్రభుత్వంలో ఇసుక స్కామ్ అతిపెద్దది. దాదాపు రూ.40వేల కోట్ల స్కామ్ అది. ఇది ఒక చిన్న భాగం మాత్రమే.. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.

- ప్రశ్న: ప్రస్తుతం టీడీపీలో ఎలాంటి నాయకత్వం నెలకొని ఉంది..? గత కొన్ని వారాలుగా మీ పాత్ర ఎలా రూపాంతరం చెందింది..?
లోకేష్ : గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు. ఆయన అరెస్టు అందరికీ బాధ కలిగించే విషయమే అయినప్పటికీ.. పార్టీ బలహీనపడలేదు. అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం. వైసీపీ నియంత పార్టీలాగ కాకుండా మా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ సమయంలో కీలకపాత్ర పోషిస్తోంది. నేను ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిని. ఏపీ ప్రజలకు సేవకుడిని. నా పాత్ర మారలేదు.. అయితే బాధ్యతలు మరింతగా నాపై పెరిగాయి.
- ప్రశ్న: 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే ఏవైనా 5 కార్యక్రమాల గురించి వివరిస్తారా..?
లోకేష్: టీడీపీ గుర్తు సైకిల్. సైకిల్కు రెండు చక్రాలు ఉంటాయి. ఒక చక్రం అభివృద్ధిని సూచిస్తే మరో చక్రం సంక్షేమంను సూచిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాలు, వారి స్థితిగతులు మార్చేందుకు తెలుగుదేశం శ్రమిస్తుంది. బడుగు బలహీనవర్గాల రూపురేఖలను మార్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టాం.. ఇకముందు కూడా చేపడతాం. మానవవనరులను అభివృద్ధి చేస్తాం. మా రాజధానితో మొదలుపెట్టి రహదారులు, తాగునీరు, గృహాలు, నిరంతర విద్యుత్ అందిస్తాం. పెట్టుబడులను ఆకర్షిస్తాం. రాష్ట్రంలో నిరుద్యగ సమస్య ఉంది. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)లో ఏపీని అగ్రగామిగా నిలబెడతాం. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు, బడుగుబలహీన వర్గాల (ఎస్సీ/ఎస్టీ,బీసీ, మహిళలు, రైతులను)సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉంటుంది. నేర రహిత, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మించడే లక్ష్యంగా పనిచేస్తాం. భవిష్యత్తుకు గ్యారెంటీ అనే సామాజిక పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే బాధ్యత తీసుకుని పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం చేస్తాం.

- ప్రశ్న: ఇక ముందు మీ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి..? ప్రతి టీడీపీ కార్యకర్త మీ నుంచి ఏమి ఆశించొచ్చు.. ఎందుకు..?
లోకేష్: నిజాయితీ, దయ, పారదర్శకత, భవిష్యత్తుకు విజన్. ప్రతి టీడీపీ కార్యకర్తకు నేను అన్నతమ్ముడిలాంటి వాడిని. నేను వారి కుటుంబ సభ్యుడిని.వారంతా నా కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి ఘోరమైన ప్రభుత్వాన్ని తొలిసారిగా చూస్తున్నాం. ఈ ప్రభుత్వంపై పోరాడుతున్నాం.ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా కూలదోసి కొత్త చరిత్ర సృష్టిస్తాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. ఇప్పుడు కనుక రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే.. మరింత నాశనం దిశగా వెళుతుంది. అప్పుడు కాపాడుకోవాలంటే చాలా కష్టమవుతుంది. నా రాష్ట్రాన్ని కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది.












Click it and Unblock the Notifications