పెట్టుబడులు సొంత డబ్బా కొట్టుకుంటే వస్తాయా జగన్ గారూ .. ఎద్దేవా చేసిన లోకేష్
నారా లోకేష్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . డిప్లామెటిక్ ఔట్ రీచ్ సదస్సులో జగన్ మాట్లాడిన తీరును తప్పు పట్టారు. మాది నిరు పేద రాష్ట్రం అని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి అంటూ ప్రశ్నించారు. సాధించిన ఓట్లు.. గెలిచిన సీట్లు చెబితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఎద్దేవా చేశారు.
Recommended Video


సాధించిన ఓట్లు, గెలిచిన సీట్లు చెప్పుకుంటే పెట్టుబడులు వస్తాయా అని సీఎం జగన్ ను ప్రశ్నించిన లోకేష్
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో మాట్లాడిన అంశాలపై విమర్శల వర్షం కురిపించారు.ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలన్న, పెద్ద ఎత్తున కంపెనీలు రావాలన్నా రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించాలని పేర్కొన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. అలా కాకుండా సాధించిన ఓట్లు, గెలిచిన సీట్లు చెప్పుకుంటే, సొంత డబ్బా కొట్టుకుంటే పెట్టుబడులు రావని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను చెప్పడం ఇష్టం లేక సీఎం జగన్ తన గురించి ఏదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.

గత ప్రభుత్వం సాధించిన ఘనతను చెప్పలేక పేద రాష్ట్రం అని జగన్ చెబుతున్నారని లోకేష్ ఆగ్రహం
ఈజ్ ఆఫ్ డుయింగ్, పాలనలో వచ్చిన 700 అవార్డుల గురించి చెప్పాల్సిన చోట, గత ప్రభుత్వం సాధించిన ఘనతను చెప్పలేక పేద రాష్ట్రం అని జగన్ చెబుతున్నారని లోకేష్ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సాధించిన ఘనతను చెప్తే, ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందో అన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేశారు.
శుక్రవారం జరిగిన డిప్లామెటిక్ ఔట్ రీచ్ సదస్సులో ఏపీ సీఎం జగన్ సదస్సుకు వచ్చిన ప్రముఖులతో పలు విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో ఏపీలో నాలుగు ఓడరేవులు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు . పరిశ్రమలు పెట్టేవారు స్థానికంగా ఉన్న యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారికి కావలసిన నైపుణ్యాల గురించి ముందే చెప్తే ఆవిధంగా శిక్షణనిచ్చి సదరు పరిశ్రమలకు అందిస్తామని జగన్ చెప్పుకొచ్చారు.

అనవసరమైన విషయాలు చెప్తే పెట్టుబడులు రావన్న లోకేష్
తమ రాష్ట్రంలో సుస్ధిరమైన ప్రభుత్వం ఉందని.. మాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారని పేర్కొన్న జగన్
తమది పేద రాష్ట్రమేనని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరం తమకు లేదని.. కాకపోతే అంత శక్తి ఉందని జగన్ పేర్కొన్నారు. పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నామని చెప్పిన జగన్ పాలనలో టెండర్ల ప్రక్రియ నుంచి కేటాయింపుల దాకా అవినీతిరహిత నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన లోకేష్ సదస్సులో మాట్లాడవలసిన అంశాలు కాకుండా జగన్ వేరే ఏదో మాట్లాడారని, అలా మాట్లాడితే పెట్టుబడులు పెడతారా జగన్ గారూ అంటూ సెటైర్లు వేస్తూ జగన్ ప్రసంగాన్ని ఎండగట్టారు.












Click it and Unblock the Notifications