ఒబామాను కలిసిన లోకేష్: బాబు గురించి ఆరా, వద్దని లేఖ రాసినా..
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గురించి వివరించారని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.
అమెరికా సంస్థల సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి బరాక్ ఒబామా తెలుసుకున్నారని చెప్పారు.
అమెరికన్ కంపెనీల ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లోకేష్ వివరించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. లోకేష్ను కలవరాదని అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాలు బరాక్ ఒబామాకు లేఖ రాసినప్పటికీ.. ఆయన లోకేష్ను కలిసేందుకే మొగ్గు చూపడం గమనార్హం.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కట్టుకథేనా అనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు లోకేష్ ఒబామాతో భేటీ కావడం గమనార్హం.