కొరడా ఝళిపించిన లోకేష్..! ఇద్దరు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలకు షాక్..!
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత వైసీపీ పాలనలో జరిగిన తప్పుల్ని పునరావృతం చేయకూడదని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా ప్రజలకు ప్రజాప్రతినిధులు కచ్చితంగా అందుబాటులో ఉండాలని, వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పట్టించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల్లో ఫిర్యాదుల స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని గతంలోనే సీరియస్ గా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఈ ఆదేశాలు పలు చోట్ల అమలు కావడం లేదు.
రాష్ట్రంలో 130 నియోజకవర్గాలకు పైగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. వీరిలో 25 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించడం లేదని పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో తేలింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా ఇలా గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని పార్టీ జోనల్ ఇన్ ఛార్జుల్ని ఆదేశించారు.

మరోవైపు టీడీపీ కార్యకర్తలకు పార్టీ తరఫున 5 లక్షల బీమా ప్రయోజనం కల్పిస్తున్నారు. తాజాగా వీరిలో రాష్ట్రవ్యాప్తంగా 600 మంది వరకూ చనిపోయారు. వీరిలో 75 మందికి ఇప్పటివరకూ 5 లక్షల బీమా ప్రయోజనం అందించలేదు. దీనికి స్ధానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. దీనిపైనా నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్ని తాను అస్సలు సహించేది లేదని జోనల్ కోఆర్డినేటర్లకు తేల్చిచెప్పేశారు.

అలాగే రాష్ట్రంలో ఇంకా నామినేటెడ్ పదవులు దక్కని నేతలపై సైతం నారా లోకేష్ దృష్టిసారించారు. నామినేటెడ్ పదవుల్లో ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు దక్కని వారికి పార్టీలో ఏదో విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత తనదేనని లోకేష్ వెల్లడించారు. ఇలాంటి వారి జాబితాను తయారు చేయాలని తాజాగా లోకేష్ జోనల్ సమన్వయకర్తల్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications