భయం నా బయోడేటాలోనే లేదు: నారా లోకేష్
కుప్పంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు గతంలో ఎన్నడూ జరగలేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో ఆయన పాదయాత్ర సాగుతోంది. మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన వాల్మీకి, కురుబ వర్గాలకు చెందిన సామాజిక భవనాలను లోకేష్ పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.10 కోట్లతో వీటిని ప్రారంభించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి నిర్మాణాలను నిలిపివేసిందని స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు.
వీటిని పూర్తిచేయాలని అధికారులను పలుమార్లు కోరుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదని తెలిపారు. చంద్రబాబునాయుడిపై కోపం ఉంటే వాటిని మీరు బీసీలపై చూపించడమేంటని లోకేష్ ప్రశ్నించారు. కమ్యూనిటీహాల్స్ నిర్మాణాలను ఆపివేయడం దుర్మార్గమన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే వీటిని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై అందరూ మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. 10 శాతం రిజర్వేషన్లు కట్ చేయడంవల్ల బీసీలు స్థానిక సంస్థల్లో వేల సంఖ్యలో పదవులు కోల్పోయారన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఈ తరహా రాజకీయాలు ఏనాడూ జరగలేదని, వీటికి కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారికి వడ్డీతోపాటు చక్రవడ్డీ కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు.
భయం నా బయోడేటాలోనే లేదు.. మర్డర్ కేసుతోపాటు అన్ని కేసులు నాపై పెట్టారు. ఏంపీకుతారో పీక్కోండంటూ సవాల్ విసిరారు. సామాజిక న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, కానీ వారు చేసేదంతా సామాజిక అన్యాయమేనని అభివర్ణించారు. మొదటిగా మనలో చైతన్యం రావాలని, ప్రజలకు అవసరమైన పనులు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఓట్ల కోసం రేపు వచ్చినప్పుడు నిలదీద్దామన్నారు.