జీవో 1పై సుప్రీం అత్యవసర విచారణ-జగన్ సర్కార్ డిమాండ్ వెనుక లోకేష్ ?
ఏపీలో కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో జగన్ సర్కార్ రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దీనిపై వెంటనే విచారణ చేపట్టేందుకు అంగీకరించలేదు. కానీ ప్రభుత్వం పట్టు వీడలేదు. దీంతో సుప్రీం అంగీకరించింది. ఇందుకు దారి తీసిన కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

జీవో నంబర్ 1 వివాదం
జీవో నంబర్ 1పై ఏపీలో వివాదాలు ముసురుకున్నాయి. ముఖ్యంగా కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల తర్వాత ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు నిషేధించింది. అయితే ఇది విపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయంగా విపక్షాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టులో సవాల్ చేశాయి. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టును కోరాయి. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. జీవో నంబర్ 1ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అంతలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకు జగన్ సర్కార్
జీవో నంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే ఉత్తర్వులపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చింది తాత్కాలిక స్టే ఉత్తర్వులే. అదీ ఈ నెల 23 వరకే. అయినా ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతే కాదు, తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కూడా కోరింది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. మరో నాలుగు రోజుల్లో హైకోర్టులో విచారణ జరిగే పిటిషన్ ను సుప్రీంకోర్టును ఆశ్రయించి కొట్టేయాలని జగన్ సర్కార్ ఎందుకు కోరిందన్న దానిపై చర్చ జరుగుతోంది.

జగన్ సర్కార్ వినతికి సుప్రీం ఓకే
ఏపీలో జీవో నంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే ఉత్తర్వులపై వెంటనే విచారణకు సుప్రీంకోర్టు తొలుత అంగీకరించలేదు. కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ను ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కారణాలపై ఆరా తీసిన ఆయన.. చివరికి ఇందుకు అంగీకరించారు. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు జీవో నంబర్ 1పై అత్యవసర విచారణ చేపట్టబోతోంది.

అత్యవసర డిమాండ్ వెనుక లోకేష్ ?
అయితే హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ అత్యవసర విచారణ చేయాలని సుప్రీంకోర్టును ఎందుకు కోరిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే విద్యార్ధి యువజన జేఏసీ యాత్రకు అనుమతి కోరింది. అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు అనుమతి కోరారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ నెల 23 వరకూ స్టే ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత హైకోర్టు జీవో నంబర్ 1పై ఇచ్చిన తాత్కాలిక స్టేపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ లోకేష్ పాదయాత్ర 27న ప్రారంభం కాబోతున్నందున కనీసం రెండు రోజుల ముందైనా అనుమతిపై డీజీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఏకంగా హైకోర్టు విచారణ పూర్తి కాకుండానే, గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టే ఎత్తేయాలని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును రాష్ట్రప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications