అబ్బాయిలు బాబాయ్ ని వేసేశారు.. ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని సీబీఐ తేల్చింది: లోకేష్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉందని పేర్కొన్న సీబీఐ ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో టిడిపి నేతలు మరోమారు వైయస్ జగన్ ను, ఎంపీ అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.
ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. రాజీనామాల సవాళ్లతో రచ్చ; మ్యాటరేంటంటే!!
వివేకా హత్యకేసులో కీలక మలుపు .. స్పందించిన నారా లోకేష్
కడప లోక్సభ నియోజకవర్గం టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు ఇవ్వాలని, తనకు కాకుంటే వైయస్ షర్మిలకు గానీ, విజయమ్మకు కానీ ఇవ్వాలని వివేకానంద రెడ్డి ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఆయనను హత్య చేయించి ఉంటారని అనుమానం ఉందని సిబిఐ వెల్లడించింది. హత్య వెనుక ఉన్న భారీ కుట్ర ను వెలికి తీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అబ్బాయిలు బాబాయ్ని వేసేశారు , సీబీఐ తేల్చింది ఇదే
అబ్బాయిలు బాబాయ్ని వేసేసి మా చేతులకు ఆ రక్తపు మరకలంటించాలని చూశారని సోషల్ మీడియా వేదికగా లోకేష్ పేర్కొన్నారు. సీబీఐ తేల్చింది ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాయించండి జగన్ మానసపుత్రిక అయిన పేపర్ ఎడిటర్ గారూ జగనాసుర రక్తచరిత్ర అని లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి మృతిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి నాడు టిడిపిపై ఈ హత్యకేసును నెట్టే ప్రయత్నం చేశారని, కానీ నేడు నిజం బయటకు వచ్చిందని లోకేష్ వ్యాఖ్యానించారు.
Recommended Video
ప్రత్యేక హోదాపై జగన్ స్పెషల్ కలలు కంటున్నారు
అంతే కాదు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్ ని టార్గెట్ చేసిన లోకేష్ జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ కల వచ్చిందంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాడేపల్లి పాలస్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా ఢిల్లీ వెళ్లినట్టు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని అదే ఫ్లైట్ లో పట్టుకొచ్చినట్టు, వైసిపి నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగినట్టు స్పెషల్ కల వచ్చింది. ఇంతలోనే తెల్లారింది అంటూ పోస్ట్ చేసిన లోకేష్ అప్పుడు అర్థమైంది అదంతా తాను ప్రత్యేకంగా తయారు చేయించిన స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ ఎఫెక్ట్ అని పేర్కొన్నారు. జగన్ నిద్రపోతున్నట్టుగా ఉన్న ఫోటోను జత చేస్తూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.