తమ్మినేనిపై నోరు జారి వెనక్కి తీసుకున్న నారాయణ
హైదరాబాద్: సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినే ని వీరభద్రంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులుకు లేఖ రాశారు. తన వల్ల వామపక్షాల ఐక్యతకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు గాను వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డితో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని సిపిఎం రూ.15 కోట్లకు బేరం కుదుర్చుకుందని నారాయణ ఇటీవల ఆరోపణ చేశారు. దీంతో నారాయణ బహిరంగ క్షమాపక్ష చెప్పాలని డిమాండ్ చేస్తూ రాఘవులు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డికి లేఖ రాశారు. ఓ ప్రతిని నారాయణకూ పంపారు. ఈ నేపథ్యంలో నారాయణ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు రాఘవులుకు లేఖ రాశారు.
సమస్యను కేంద్రానికి నివేదించినందున సకాలంలో తాను రాఘవులు లేఖకు బదులివ్వలేదనిస కేంద్ర పార్టీ ఆదేశం మేరకే మీకు ఈ ఉత్తరం రాస్తున్నానని, సిపిఎం వైసిపితో రాష్ట్రవ్యాప్త, లేదా తెలంగాణవ్యాప్త ఎన్నికల అవగాహన పెట్టుకుంటే తప్పుపట్టేవారం కాదని, కేవలం తాను సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖమ్మం పార్లమెంటు స్థానం వరకే వైసీపీతో రాజకీ య అవగాహన పెట్టుకున్నారని, దీనివల్లే సీపీఎంపై తమకు అపోహలు రావడానికి అవకాశమేర్పడిందని నారాయణ ఆ లేఖలో అన్నారు.
ప్రజా బాహుళ్యంలో, వామపక్ష అభిమానుల్లో చర్చలు విస్తృతంగా జరిగాయని, సిపిఎం ఎన్నికల ప్రచారం వరకే పరిమితం కాకుండా అంతకన్నా మించి వ్యవహరించారని తాము భావిస్తున్నామని, అది భాధ కలిగించిందని, కాబట్టే వీరభద్రంపై ఆవేశంతో అలాంటి వ్యాఖ్య చేశానని ఆయన అన్నారు.
తాను అలా వ్యాఖ్యానించినందుకు విచారిస్తున్నానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన రాఘవులుకు రాసిన లేఖలో అన్నారు.