ఆందోళనగా ఉంది: మోడీ, పవన్కి కితాబు, తెరాసపై నో
నిజామాబాద్: ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో కీలకమైనవని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మంగళవారం నిజామాబాద్ సభలో అన్నారు. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలను చూడవద్దన్నారు. ఎందరో బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ భాగ్యరేఖను మార్చుతామన్నారు.
ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదన్నారు. ప్రజల ఉద్యమం వల్ల వచ్చిందన్నారు. వందలమంది ప్రాణాలు బలిదానాలు చేసుకున్నారని, అలాంటి కాంగ్రెసు పార్టీకి ఓటు వేసి గెలిపిద్దామా అన్నారు. తెలంగాణ ప్రజల పైన నమ్మకంతో తాను ఇక్కడ అడుగు పెట్టానని చెప్పారు. రానున్న ఐదేళ్లలో తెలంగాణ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణను ఎవరి చేతుల్లోనో పెడితే ఏమవుతుందోననే ఆందోళన ఉందన్నారు.

ఇక్కడి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిందని, తెలంగాణ బిడ్డ పివిని సోనియా కుటుంబం అవమానించిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీని చూస్తే ఆ పార్టీని నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రజలను గౌరవించాలని కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. ఏ వ్యక్తి ఆర్థిక సంస్కరణల వల్ల కాంగ్రెసు పార్టీ, దేశం నిలబడిందో.. ఆ పివినే కాంగ్రెసు పార్టీ మరిచిపోయిందన్నారు. కనీసం గౌరవించడం లేదన్నారు.
ఎంతోమంది నిజామాబాద్ యువకులు గల్ఫ్కు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే ఉపాధి దొరికితే ప్రజలు గల్ఫ్కు వెళ్లే పని ఉండదన్నారు. గల్ఫ్ యువత హక్కులు ఎవరు కాపాడాలన్నారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన అత్యంత ప్రమాదకరమన్నారు. వందలాదిమంది ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెసు పార్టీకి ఓటేద్దామా అన్నారు. సీమాంధ్ర అయినా, తెలంగాణ అయినా తెలుగు మన తల్లి అన్నారు. కాంగ్రెసు పార్టీ బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపేసిందన్నారు. ఢిల్లీలో, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు.
మొత్తం ఇందిర కుటుంబం తెలుగు ప్రజలను అవమానిస్తూ వస్తోందన్నారు. గాంధీ కుటుంబాన్ని కాదని పివి ప్రదాని అయ్యారని, ఆయన జ్ఞాపకాలను చెరిపి వేశారన్నారు. కాంగ్రెసుకు మళ్లీ ఓటేస్తే అమరులను అవమానించినట్లే అవుతుందన్నారు. భారీ మెజార్టీతో కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టాలన్నారు. ఆ తల్లీ కొడుకుల పాలన దేశాన్ని నాశనం చేసిందన్నారు. దేశ సరిహద్దుల్లో కన్నా ఉగ్రవాదుల వల్లనే మన జవాన్లు ఎక్కువమంది చనిపోతున్నారని, జవాన్ల తలలు నరికినా కాంగ్రెసు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణకు అంగీకరించిందన్నారు. కాగా, నిజామాబాద్ సభలో మోడీ తెరాసను ప్రస్తావించలేదు.
పవన్ కళ్యాణ్ పైన..
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటలు తనను హత్తుకున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ వంటి వారు తెలుగు స్ఫూర్తిని కాపాడగలరని పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications