చెన్నైలో కావలి టెక్కీ అదృశ్యం! కిడ్నాపా?.. బీచ్లో గల్లంతా?
నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నై మహానగరంలో అదృశ్యమయ్యాడు. అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చెన్నై: నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నై మహానగరంలో అదృశ్యమయ్యాడు. గత శనివారం సాయంత్రం వేళ కాస్త సేదతీరేందుకు సముద్రతీరానికి వెళ్లిన ఆ టెక్కీ తిరిగి తన గదికి చేరలేదు. అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా కావలికి చెందిన కంచర్ల వెంకట సాయితేజ (24) అనే యువకుడు చెన్నైలోని టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 13వ తేదీన తన గదిలో పర్స్, ఫోను పెట్టి బైక్పై బీచ్కు వెళ్లిన అతడు మళ్లీ తిరిగి గదికి రాలేదు.
స్నేహితులు అతడి కోసం తీవ్రంగా గాలించగా బీచ్లో అతడి బైక్, చెప్పులు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంకట సాయితేజ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.
కుమారుడు అదృశ్యమయ్యాడన్న వార్తతో ఆందోళన చెందిన సాయి కుటుంబ సభ్యులు సోమవారం చెన్నై చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు కూడా తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట సాయితేజ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తమ కుమారుడిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కూడా సాయి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.