ఎపి రాజధానిలో కొత్త కోణం: పవన్ కళ్యాణ్ ట్విస్ట్
హైదరాబాద్: చరిత్ర పునరావృతమవుతుందని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అదే జరిగినట్లు పరిమామాలు తెలియజేస్తున్నాయి. అయితే, రాజధానికి కర్నూలును ఎంపిక చేసుకోవాలా, విజయవాడను ఎంపిక చేసుకోవాలా అనే విషయంలో మాత్రం చరిత్ర తిరగబడింది. మద్రాసు రాష్ట్ర నుంచి ఆంధ్ర విడిపోయే సమయంలో రాజధాని విషయంలో రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య వివాదం చెలరేగి, రాయలసీమ విజయం సాధించింది. ఈసారి మాత్రం కోస్తాంధ్ర విజయం సాధించింది. అది పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే జరిగిందని చెప్పవచ్చు.
ఎన్నికల్లో చంద్రబాబు నాయుకత్వంలోని తెలుగుదేశం పార్టీ కాకుండా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించి ఉంటే రాజధాని అంశం మరో రకంగా ఉండేది. గుంటూరు, విజయవాడ మధ్య కాకుండా మరో ప్రాంతం రాజధానిగా ఎంపికై ఉండేది. మద్రాసు రాష్ట్రం నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సమయంలో ఇరు ప్రాంతాల మధ్య రాజధాని విషయంలో రగడ జరిగింది. ఈ విషయాన్ని గౌతం పింగ్లే తన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ అనే గ్రంథంలో ఉదాహరణలతో సహా వివరించారు.
అందుకు సంబంధించిన కుల సమీకరణాలను కూడా ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆంధ్ర రాజకీయాల్లో అప్పట్లో రెడ్లు, కమ్మ వర్గాలదే ఆధిపత్యం. ఇందులో కమ్మ వర్గం విజయవాడను రాజధానిగా కోరుకోగా, రాయలసీమకు చెందిన రెడ్లు కర్నూలును రాజధానిగా కోరుకున్నారు. అయితే, ఈ సమరంలో రాయలసీమ రెడ్లు మద్రాసు శాసనసభ్యుల సహకారంతో విజయం సాధించారు. కర్నూలు రాజధానిగా నిర్ణయిస్తూ అప్పట్లో మద్రాసు శాసనసభ ఓ తీర్మానం చేసింది. ఈ విషయంలో రాయలసీమ రెడ్డి వర్గం మద్రాసు శాసనసభ్యుల సహకారంతో నెగ్గింది. దాంతో అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
ఈ విషయాన్ని అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కుపరంగా రెడ్డి అయిన పుచ్చపల్లి సుందరయ్య కూడా ప్రస్తావించారు. కమ్మ, రెడ్డి వర్గాల మధ్య కాంగ్రెసు పార్టీ అంతర్గత వైరుధ్యాల నేపథ్యంలో రాయలసీమ రెడ్డి వర్గం విజయం సాధించింది. ఇప్పుడు మాత్రం కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గం విజయం సాధించిందని చెప్పవచ్చు. రాయలసీమ నాయకులు చాలా మంది రాయలసీమలో ఎపి రాజధాని కావాలని కోరుకున్నప్పటికీ తెలుగుదేశంలోని రాయలసీమ నాయకులు చంద్రబాబును ధిక్కరించలేని పరిస్థితిలో పడిపోగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోవడంతో రాయలసీమ రెడ్డి వర్గానికి గొంతు లేకుండా పోయింది.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి సహకారంతోనే కాకుండా సినీ నటుడు పవన్ కళ్యాణ్ వల్ల కూడా విజయం సాధించగలిగింది. నిజానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు తెలుగుదేశం పార్టీ వైపు ఉండంగా, కాపు సామాజిక వర్గం కాంగ్రెసు వైపు ఉంటూ వచ్చింది. అయితే, పవన్ కళ్యాణ్ కారణంగా కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య అంతర్గత అవగాహన ఏర్పడి ఒక్కటైనట్లు భావిస్తున్నారు. దాంతో విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసుకునే విషయంలో కోస్తాంధ్ర నాయకత్వం సఫలమైందని భావించవచ్చు.