బీజేపీలో పురందేశ్వరి టార్గెట్ అయ్యారా - వాట్ నెక్స్ట్..!?
ఏపీ బీజేపీలో కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరి నిర్ణయం ఆసక్తి కరంగా మారతుతోంది.
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది. కీలక నేతలను కొందరు టార్గెట్ చేస్తున్నారా. వరుసగా నేతలు పార్టీని వీడటం..పరోక్షంగా కౌంటర్లు ఇవ్వటం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. ఏపీ బీజేపీలో చాలా కాలంగా రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా పార్టీ వీడిన కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేసారు. అదే విధంగా ఎంపీ జీవీఎల్ శైలిని తప్పు బట్టారు. ఇక.. ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పరోక్షంగా ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీలో పురందేశ్వరి కొందరు నేతలకు టార్గెట్ గా మారారనే వాదన వినిపిస్తోంది పురందేశ్వరి పార్టీలో కొనసాగుతారా..ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారా అనేది ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

ఏపీ బీజేపీలో కొత్త వివాదాలు
ఏపీ బీజేపీలో కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనతో పొత్తు కొనసాగుతున్నా.. రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాని మోదీ - అమిత్ షా తో సమావేశాల తరువాతా పార్టీలో వచ్చిన మార్పు లేదు. వైసీపీ- టీడీపీ అనుకూల నేతలుగా బీజేపీలోని కొందరు నేతల పైన ప్రచారం ఉంది. ఇక.. పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. సోము వీర్రాజు వ్యవహార శైలి పైన కన్నా లాంటి నేతలు పార్టీలో ఉన్న సమయంలోనే ఆరోపణలు చేసారు. పార్టీ వీడేందుకు నిర్ణయించిన కన్నా..ఉద్దేశ పూర్వకంగా సోము వీర్రాజు పైన ఆరోపణలు చేసారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంపీ జీవీఎల్ వేస్తున్న అడుగులు..వ్యవహార శైలి తాజా వివాదంగా మారుతోంది.

జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్
బీజేపీలో పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టటం పైన తాజా గా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. జీవీఎల్ ఈ మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో ప్రస్తావించటంతో పాటుగా ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. విశాఖలో..తాజాగా విజయవాడలో కాపు నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ - వైఎస్సార్ పేర్లు గురించి ప్రస్తావించారు. దీనికి పురందేశ్వరి స్పందించారు. జీవీఎల్ వ్యాఖ్యలకు సమాధానంగా 'ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు' అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ - వైఎస్సార్ పథకాలు..ప్రత్యేకతను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications