ఎపి రాజధానిలో విస్తరిస్తున్న కొత్త సంస్కృతి....జోరుగా సాగుతున్నమహిళా పేకాట కేంద్రాలు...
విజయవాడ : ఎపి రాజధాని నగరంలో కొత్త సంస్కృతులు విస్తరిస్తున్నాయి. బెట్టింగ్ కు పురుషులే కాదు మేము సై అంటున్నారు కొందరు మహిళలు. ఇప్పటిదాకా పేకాడ క్లబ్బుకు వెళ్లి పాడైపోతున్నాడనే మాట మగాళ్ల గురించే వినేవాళ్లం...అయితే ఇకనుంచి ఆ మాట ఆడవాళ్లకు కూడా వర్తిస్తుందని విజయవాడలో వెలుగుచూసిన తాజా ఉదంతం స్పష్టం చేస్తోంది.
ఆడవాళ్లు పేకాట క్లబ్బులకి వెళ్లడం సినిమాల్లోనో...లేదా మెట్రోపాలిటన్ నగరాల్లోనో చూసి ఉంటారు...కానీ ఇప్పుడు అదే కల్చర్ చాపకింద నీరుగా ఎపి రాజధానిలో కూడా విస్తరిస్తోందా అంటే అవుననే తాజా ఘటన రుజువు చేస్తోంది. ఈ పరిణామంతో ఎపి రాజధాని కూడా ఇంత తొందరగా మెట్రో పాలిటన్ స్థాయికి ఎదిగిపోయిందని సంతోషపడతారో...లేక అభివృద్ది కన్నా ముందు అనారోగ్య ధోరణులు విస్తరిస్తున్నాయని బాధపడతారో మీ ఇష్టం అంటోంది ఈ నయా కల్చర్. ఇంతకీ విషయమేమిటంటే...
కింగ్ పోయి క్వీన్ వచ్చే...
విజయవాడలో కొందరు మహిణామళులు జోరుగా పేకాడేస్తున్నారు. వందలు..వేలు కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు పర్సుల్లో కుక్కుకొని సిట్టింగ్ల్లో కూర్చుంటున్నారు. ఆహా ఏమీ ఈ కళావర్ రాణుల కళ అనిపించేలా కాయ్ రాణీ కాయ్ అంటూ ముక్కలు తిప్పుతున్నారు. రాణులు అనిపించేలా ముక్క తిప్పుతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యమైనా.. ఈ ఆటవిడుపులో తాము సైతం అన్న చందంగా అడేస్తున్నారు.
ఆడటమే కాదు...
ఆడటమే కాదు ఆడిస్తున్నారు కూడా...సాధారణంగా ఎక్కడైనా ఆడవాళ్లు పేకాడినా వినోడం కోసం ఆడతారు. కానీ ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అలా కాదు. కేవలం ఆటవిడుపుగా ఆడితే ఏమొస్తుందనుకున్నారో ఏమో...ఏకంగా డబ్బుల కోసం క్లబ్బుల్లో కూడా ఆడేస్తున్నారు. అయితే ఈ క్లబ్బులు రహస్యంగా నడుస్తుంటాయి...అంతే..
నిర్వాహకురాలు దొరికిపోయింది...
ఇలా మహిళలతో లక్షల్లో పేకాడిస్తున్న ఒక నిర్వాహకురాలి గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ అపార్ట్ మెంట్ లో మహిళల చేత మహిళల కోసమే ఒక పేకాట క్లబ్ నడుస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి మరీ ఆ స్థావరాన్ని చేధించారు. సడెన్ గా రెయిడ్ చేసి పేకాట నిర్వాహకురాలితో పాటు పలువురు మహిళల్ని, పెద్ద మొత్తంలో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పేకాట జరుగుతున్న తంతు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...
ఎవరు...ఎక్కడంటే...
మొదట్లో పేకాట ఆడుతూ దానికి ఎడిక్ట్ అయి తానే పేకాట శిబిరం నిర్వహకురాలిగా అవతారమెత్తింది పాలడుగు రాజేశ్వరి (55) అనే మహిళ. ఈమె జెడినగర్ కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి భార్య అని తెలిసింది. ఈమె గత కొంతకాలంగా గురునానక్ కాలనీలోని న్యాక్ కళ్యాణ మండపం సమీపంలో కెఎస్ఎన్ క్లాసిక్ అపార్ట్మెంట్లో ఈ ఉమెన్స్ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం క్రితం ఈ అపార్ట్ మెంట్లో ఒక ఫ్లాటు అద్దెకు తీసుకున్న ఈమె మొదట్లో చిన్న చిన్న కార్యక్రమాలు గెట్ టు గెదర్, పార్టీలు వంటి కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చేదట. ఆ తరువాత ఇలా పేకాట నిర్వహణకు తెర తీసింది.
అనూహ్య స్పందన...
అయితే ఆమె ఊహించని విధంగా ఈ మహిళా క్లబ్ కు అనూహ్య స్పందన రావడంతో పేకాట మూడు పువ్వులు ఆరుకాయల్లా జోరుగా సాగుతోందట. పెద్ద పెద్ద వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల భార్యల సహకారంతో బంకిని వసూలు చేస్తూ మహిళలు పేకాట ఆడుకునేందుకు అవకాశం ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా క్లబ్బు నిర్వహిస్తోంది. దీంతో విజయవాడ నగరానికి చెందినవాళ్లే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి కూడా పలువురు పేకాట అలవాటున్నమహిళలు, వారికి తెలిసినవారు ఇక్కడకు వచ్చి జోరుగా ముక్కలు కలుపుతున్నారట.
పోలీసుల దాడితో ఆట కట్టు...
ఈ మహిళా పేకాట క్లబ్బు గురించి సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ ఆర్ సురేష్రెడ్డి గత కొద్దిరోజులుగా నిఘా వేశారు. ఈక్రమంలో ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పక్కా సమాచారంతో సిబ్బందితో అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించారు. పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు మహిళలతో సహా మొత్తం 21మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలు పాలడుగు రాజేశ్వరిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరి నుంచి ఏడు లక్షల 32వేల 100 రూపాయలు నగదు, ఏడు మోటారు సైకిళ్ళు, 23సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకుని పటమట పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.