కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన లేదా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్తగా ఏర్పడే జిల్లాలు, పాత వాటితో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య ఎంతనే విషయంలో వైసీపీ సర్కారు డోలాయమానంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలపై ఇదివరకే రూపొందిన రెవెన్యూ శాఖ రిపోర్టును కాదని, కొత్తగా చీఫ్ సెక్రటరీ సారధ్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.. దానికి సంబంధించిన ఉత్తర్వులను రాత్రిరాత్రే సవరించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పని ప్రారంభించిన సీఎస్ కమిటీ ముందుకు కీలక అంశాలు పరిశీలనకు వస్తున్నాయి. గందరగోళం నడుమ చివరికి కేసీఆర్ ఫార్ములానే ఖరారయ్యే అవకాశాలూ లేకపోలేవనే వాదన వినిపిస్తోంది.

అర్ధరాత్రి దాటాక జీవో సవరణ..
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం సీఎస్ నీలం సాహ్ని ఆధ్వర్యంలో ఆరుగురితో కమిటీ వేస్తున్నామని, కమిటీలో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఈనెల 7న జీవో జారీ చేసింది. అయితే, అధ్యయనానికి ముందుగానే జిల్లాల సంఖ్యను 25కు ఫిక్స్ చేయడంపై విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో 24 గంటలు తిరక్కముందే.. మొత్తం జిల్లాలు 25 లేదా 26 అన్న పదాన్ని జోడిస్తూ శనివారం అర్ధరాత్రి దాటాక జీవోను సవరిస్తూ, కొత్తదాన్ని(జీవో నంబర్ 2101) జారీ చేశారు. అధ్యయన కమిటీకి మూడు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే.

కమిటీ ముందుకు కీలక అంశాలు..
కొత్తగా ఏర్పడబోయే జిల్లాల సంఖ్యను 25 నుంచి 26కు పెంచుతూ జీవోను సవరించిన తర్వాత, సీఎస్ కమిటీ సైతం అదే దిశలో అధ్యయనాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. గిరిజన ప్రాంతాలకు అరకుతోపాటు ప్రత్యేకంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశం కూడా కమిటీ ముందుకు వచ్చినటట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవనే వాదన మొదటి నుంచే వినిపిస్తోంది. ప్రధానంగా అరకు లోక్ సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం, రాజంపేట, బాపట్ల లోక్ సభ స్థానాలు రెండేసి జిల్లాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మెజార్టీ ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో జిల్లాల పునర్విభజన జరగాలని అధికార పార్టీ నేతలే వాదిస్తున్నారు. వీటికి సంబంధించి ఆయా నేతలు తమ అభ్యంతరాలు, సూచనల్ని సీఎస్ కమిటీకి అందజేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

జిల్లా కేంద్రాలు, పేర్లపైనా తకరారు..
ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల్లో.. 7 చోట్ల జిల్లా కేంద్రాలు సుదూరంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లోనూ 9 చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొనే అవకాశాలున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఆయా జిల్లాల నేతలు జిల్లా ప్రధాన కేంద్రంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త జిల్లాల విభజన చేయాలని అంటుననారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న పేర్లకు చారిత్రక, భౌగోళిక పరిస్థితులు అనేకం ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాలకు పేర్ల విషయంలోనూ సమస్యలు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కృష్ణాను ఎన్టీఆర్ జిల్లాగా, పశ్చిమగోదావరిని అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చుతామని ప్రభుత్వమే ప్రకటించడం తెలిసిందే.

రెవెన్యూ లెక్కల ప్రకారం 28 జిల్లాలు?
కొత్త జిల్లాలపై హామీ ఇచ్చిన మేరకు.. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే రెవెన్యూ శాఖతో అధ్యయనం చేయించారు. కేవలం లోక్సభ నియోజకవర్గల ప్రాతిపదికనే జిల్లాల్ని విభజిస్తే అరకు (ఎస్టీ), ఏలూరు, రాజంపేట, బాపట్ల లాంటి స్థానాలకు ఈ సూత్రం వర్తించదని, పైగా, విస్తీర్ణం, రోడ్ కనెక్టివిటీ, జిల్లా కేంద్రం తదితర అంశాల పరంగా అరకు స్థానాన్ని మూడు జిల్లాలుగా(పార్వతీపురం, అరకు, రంపచోడవరం), ఏలూరు లోక్ సభను రెండు జిల్లాలుగా(ఏలూరు, పోలవరం) విభజించాల్సి వస్తుందని తద్వారా మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరగొచ్చని రెవెన్యూ శాఖ రిపోర్టులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అసలు, జిల్లాలు ఏర్పాటు చేయడాని కంటే ముందు.. గ్రామం, మండలం, రెవె న్యూ డివిజన్ల వారీగా పునర్విభజన చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ఏపీలో కేసీఆర్ ఫార్ములా తప్పదా?
పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇవాళ కాకుంటే రేపైనా పెరగాల్సి ఉండగా, ఇప్పుడున్న లోక్ సభ స్థానాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటు కరెక్టు కాదనే వాదన వినిపిస్తోంది. దేశంలో జిల్లాల ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలేవీ రూపొందించలేదు. ఏపీ నుంచి విడిపోయిన రెండేళ్లకే కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాల్ని అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో ఉన్నవి 17 లోక్ సభ స్థానాలే అయినా, ఆ సంఖ్యతో నిమిత్తం లేకుండా ఏకంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో భిన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏపీలోనూ కేసీఆర్ ఫార్ములాను అనుసరించి, లోక్ సభ సెగ్మెంట్ల వారీగా కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.












Click it and Unblock the Notifications