హైద్రాబాద్లో ఏపీవాళ్లు బాగున్నారు, ఇక్కడ మాత్రం: బాబుకు బైరెడ్డి కొత్త తలనొప్పి
కర్నూలు: నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒకదాని వెంట మరొక తలనొప్పి వచ్చి పడుతోంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల అంశంతో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. ఆయన మరోసారి ప్రత్యేక రాయలసీమ డిమాండును వినిపించారు. ఓ వైపు కాపు రిజర్వేషన్ ఆందోళన, మరోవైపు, బీసీ సంఘాల అల్టిమేటం కొనసాగుతుండగానే బైరెడ్డి ప్రత్యేక సీమ అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ చెప్పింది తనకైనా అర్థమైందా: వర్మ సెటైర్
సోమవారం నాడు బైరెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక రాయలసీమ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. ఏపీలో రాయలసీమ పౌరులను మూడో తరగతి వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఏపీ వాళ్లు బాగానే బతుకుతున్నారని, నవ్యాంధ్రలోనే సీమవాసులు మూడో తరగతివారిగా ఉన్నారన్నారు.
'వైసిపిలోకి వెళ్దాం'
కాంగ్రెస్ పార్టీలో ఎంత కాలం ఉన్నా ప్రయోజనం లేదని, వైసిపిలోకి వెల్దామని.. మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూపై ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం త్వరలో జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి అట్టహాసంగా వెళ్లేందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు, మద్దతుదారులతో నెహ్రూ గుణదలలోని తన నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ పీసీసీ కార్యాలయ ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించగా.. ఇక కాంగ్రెస్ పార్టీలో వద్దని వైసిపిలోకి వెళ్లిపోదామంటూ కొంతమంది మద్దతుదారులు నెహ్రూపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
అయితే నెహ్రూ మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించకుండా కేవలం వారి వైపు చూస్తూ నవ్వుతూ వదిలేసినట్లు తెలిసింది. గతంలో ఇదే ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నెహ్రూ భరోసా ఇస్తూ వచ్చేవారు. ఈసారి అలా చేయలేదని తెలుస్తోంది.