గుంటూరు విచిత్ర ఫిర్యాదు ట్విస్ట్: తాత ముందు మనవరాలి కొత్తవాదన
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ వ్యక్తి తన మనవరాలిని ఇంటి నుంచి తరిమేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని కలిగించిన విషయం తెలిసిందే. తన ఇంటికి వచ్చిన మనవరాలిని తిరిగి పంపించేయాలని విజయేందర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే, అసలు విషయం ఏమంటే.. ఆ మనవరాలు (కూతురి కూతురు) బలవంతంగానే ఇంటిలో ఉంటుందని తేలింది. తనను కూడా మీ కొడుకుతో సమానంగా చూడాలని ఆ తాతకు చెప్పింది. మనవరాలి బాధ భరించలేక ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన విజయేందర్ రావు తాడేపల్లిలోని ఆర్ఎంఎస్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు కొడుకుతో పాటు ఓ కూతురు కూడా ఉంది. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేసిన సదరు వ్యక్తి... కూతురును అత్తారింటికి పంపారు. కొడుకు మాత్రం ఆయన వద్దే ఉండిపోయాడు.
గుంటూరులో విచిత్రమైన ఫిర్యాదు: తలలు పట్టుకున్న పోలీసులు
అనంతరం కూతురి కుమార్తె (మనవరాలు)కు కూడా పెళ్లి అయ్యింది. మనవరాలు కూడా అత్తారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమైందో కానీ... ఇటీవల ఆ మనవరాలు తన భర్తతో కలిసి తాత ఇంటికి వచ్చేసింది. రోజులు గడుస్తున్నా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోలేదు.
వృద్దుడైన ఆ మాజీ సైనికుడి సతీమణికి పది మందికి పైగా బంధువులకు వండి వార్చే శక్తి లేకపోయింది. మీరు వచ్చి చాలా రోజులవుతోందని, ఇక వెళ్లి పోవాలని మనవరాలికి ఆ తాత సూచించారు. కానీ మనవరాలు మాత్రం తాత పైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొడుకు కొడుకు(మనవడు)తో సమానంగా కూతురు కుమార్తె(మనవరాలి) హోదాలో తనకూ ఆస్తిలో హక్కుందని కొత్త వాదనను తెర పైకి తెచ్చింది. దీంతో షాక్ తిన్న విజయేందర్ చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. భర్తతో కలిసి తన ఇంట్లో తిష్ట వేసిన మనవరాలు ఎంతకీ ఇల్లు వదిలి వెళ్లడం లేదని, కొత్తగా తనకూ ఆస్తిలో హక్కుందని బెదిరిస్తోందని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును అందుకున్న పోలీసులు అయోమయంలో పడ్డ విషయం తెలిసిందే. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో పాలుపోక వారు అయోమయస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కేసును వారు ఎలా పరిష్కరిస్తారో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా ఉన్నారు.