వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే: ఏర్పాట్లు: 61 మంది
అమరావతి: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖాయం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యలు సహా దేశవ్యాప్తంగా 61 మంది వేర్వేరు పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. ఈ నెల 22వ తేదీన రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ హౌస్ ఛాంబర్లో వారంతా ప్రమాణ స్వీకారం చేస్తారు.
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. ఈ సారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతుండటం ఇదే తొలిసారి అవుతుంది. 20 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 61 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేయదలిచిన ప్రతి సభ్యుడు కూడా తమ వెంట ఒకరిని మాత్రమే వెంట తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చారు.
అంతకుమించి- తీసుకొచ్చే వారెవరికీ అనుమతి ఇవ్వబోమని పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేయబోయే సభ్యుడి వెంట వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అనుచురులు హాజరవుతుంటారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారెవరికీ అనుమతి ఇవ్వట్లేదని అన్నారు. సభ్యుడి వెంట రావడానికి ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్యసభ, లోక్సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున నలుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ నేత అయోధ్యా రామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ వైసీపీ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కిందటి నెల 19వ తేదీన నిర్వహించిన పోలింగ్ సందర్భంగా వారు విజయం సాధించారు. అయిదో అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య పోటీ చేసినప్పటికీ.. ఆయన పరాజయం పాలయ్యారు.