వైఎస్ జగన్తో తిరుపతి కొత్త ఎంపీ భేటీ: దానిపై అసంతృప్తి: కారణాలేమిటంటూ ఆరా!
అమరావతి: తిరుపతి లోక్సభ సభ్యుడిగా కొత్తగా ఎన్నికైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. 2.60 లక్షల ఓట్లకు పైగా తేడాతో తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని ఓడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయన వైఎస్ జగన్ను మర్యాదపూరకంగా కలిశారు.
ఆ సమయంలో డాక్టర్ గురుమూర్తి వెంట- ఉప ముఖ్యమంత్రి కళత్తూర్ నారాయణ స్వామి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొత్తగా లోక్సభలో అడుగు పెట్టబోతోన్నందున..తరచూ తన గళాన్ని వినిపించాలని వైఎస్ జగన్ ఆయనకు సూచించారు. ప్రతి అంశంపైనా అవగాహన పెంచుకోవాలని, సునిశితంగా పరిశీలించాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లులు, ఇతరత్రా డిబేట్లపై పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినప్పటికీ.. ఆ లోటును తీర్చేలా వ్యవహరించిన మంత్రులు, చిత్తూరు నెల్లూరు జిల్లా శాసన సభ్యులకు వైఎస్ జగన్ అభినందించారు. వారిని ప్రశంసించారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకూ చేరేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా మెజారిటీ రాకపోవడం వల్ల వైఎస్ జగన్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు మెజారిటీని తీసుకుని రావాలని భావించినప్పటికీ- దాన్ని అందుకోలేకపోవడానికి గల కారణాలేమిటని వైఎస్ జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ ఊహించిన దాని కంటే బలంగా ఉందని, గట్టి పోటీ ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్కు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ- 2019 నాటి ఎన్నికల్లో వచ్చిన దాని కంటే అధిక మెజారిటీ రావడం పట్ల వైెఎస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications