ఏపీలో కనిపించని సడలింపుల ప్రభావం- తెరచుకోని పరిశ్రమలు- భయాలే అసలు కారణం..
ఏపీలో ఏప్రిల్ 20 నుంచి పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. పారిశ్రామిక వృద్ధి పూర్తిగా కుంటుపడిపోతే తిరిగి కోలుకోవడం కష్టమని భావిస్తున్న ప్రభుత్వం కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ కార్మికుల్లో నెలకొన్న కరోనా వైరస్ భయాలు వారిని ఇళ్లు దాటనీయడం లేదు. దీంతో చాలా చోట్ల పరిశ్రమలు తెరిచే పరిస్ధితి కనిపించడం లేదు.

సడలింపులు ఇచ్చినా..
ఏపీలో కరోనా వైరస్ భయాల నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ పరిశ్రమల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. కరోనా రెడ్ జోన్లు లేని ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతులు కోరిన వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు వాటిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉద్యోగులు, కార్మికుల్లో నెలకొన్న కరోనా వైరస్ భయాలే ఇందుకు కారణమనితెలుస్తోంది.

ఇళ్ల నుంచి బయటికి రాని కార్మికులు..
లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇఛ్చినా పరిశ్రమలు పూర్తి స్ధాయిలో తెరిచే పరిస్ధితి లేదు. పరిమిత స్ధాయిలో పరిశ్రమలు తెరవాలని భావించిన యాజమాన్యాలు ఆ మేరకు కార్మికులకు సమాచారం అందించాయి. సోమవారం నుంచి విధుల్లోకి రావాలని కార్మికులను కోరాయి. కానీ వీరిలో చాలా మంది తిరిగి పనిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కరోనా భయాలతో ఇంటి వద్దే ఉంటున్న వీరంతా పరిశ్రమల్లోకి వచ్చి గతంలోలా పనులు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు.

పరిశ్రమలకు సడలింపులు, మరి కార్మికులకు ?
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో సోమవారం నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించిన పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే కార్మికులకు మాత్రం చాలా చోట్ల పాసులు ఇవ్వలేదు. దీంతో వీరంతా పోలీసు ఆంక్షలను దాటుకుని పరిశ్రమలకు రావాల్సి ఉంది. అసలే లాక్ డౌన్ పేరుతో బయట కనిపిస్తే చాలు పోలీసులు బాదేస్తున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదం పెట్టుకుని మరీ విధుల్లోకి వెళ్లడం అవసరమా అన్న భావన సాధారణ కార్మికుల్లో కనిపిస్తోంది.

రవాణా సమస్యలతో ...
గ్రామీణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు వెళ్లాలంటే కార్మికులు ప్రజా రవాణాను ఆశ్రయించేవారు. ఆటోలు, బస్సుల్లో పరిశ్రమలకు చేరుకునే వారు. కొన్ని పెద్ద కంపెనీలు మాత్రం కార్మికులకు బస్సు, వ్యాన్ సదుపాయాలు కల్పించేవి. ఇప్పుడు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోవడం, ప్రస్తుతం ఉన్న నష్టాల పరిస్ధితిలో కార్మికులందరికీ ఉచిత రవాణా కల్పించడం పరిశ్రమలకు తలకు మించిన భారమవుతోంది. దీంతో వారు ఏదో రకంగా సొంత వాహనాల్లోనే విధుల్లోకి రావాలని కోరుతున్నాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే మాత్రం కార్మికులకు ఉచిత రవాణా ఇవ్వక తప్పని పరిస్ధితి రావొచ్చని తెలుస్తోంది.