టీడీపీకి జగన్ మరో షాక్- వైజాగ్ లో మోడీ సభకు ఎమ్మెల్యేలకూ నో-ప్రోటోకాల్ ఉన్నా !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు రోజురోజుకూ పతాకస్ధాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనలో ఇది మరోమారు స్పష్టమవుతోంది. విశాఖలో ప్రధాని మోడీ బహిరంగసభకు టీడీపీ స్ధానిక ఎమ్మెల్యేలకు జగన్ సర్కార్ ఆహ్వానం పంపలేదు.
రేపు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే ప్రధాని మోడీ ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంఖుస్ధాపనలు చేయబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రధాని మోడీ సభలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. కానీ ప్రోటోకాల్ ఉన్న స్ధానిక ప్రజాప్రతినిధులకు మాత్రం జగన్ సర్కార్ దూరంగా పెట్టేస్తోంది.
విశాఖ నగరంలో జరుగుతున్న ప్రధాని మోడీ సభకు వాస్తవంగా అయితే స్ధానిక ఎమ్మెల్యేలందరికీ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వనాలు పంపుతారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. చివరికి ప్రధాని సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సైతం ఆహ్వానం అందలేదు. పూర్తి అధికారిక కార్యక్రమం, ప్రోటోకాల్ కార్యక్రమం అయిన ప్రధాని మోడీ సభకు స్ధానిక ప్రజాప్రతినిధుల్ని దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు తావిస్తోంది.