ఉల్లంఘన లేదు: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై వెంకయ్య
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోకసభ ఆమోదించడంలో ఏ విధమైన ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే లోతుగా చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చర్చ జరిగితే విషయాలు ప్రజలకు తెలిసి ఉండేవని అన్నారు. కొంత మంది సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో చర్చకు అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు.
నిర్ణీత కాల వ్యవధిలో పార్లమెంటు ఉభయసభల్లో బిల్లును ఆమోదించి, రాష్ట్రపతికి పంపించాల్సి ఉందని ఆయన అన్నారు. అన్ని పార్టీలను సంప్రదించి, బిల్లు ఆమోదానికి సమయం కేటాయించినట్లు తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్ విషయంలో వివాదం అవసరం లేదని ఆయన అన్నారు. కొందరు సభ్యుల వైఖరి దురదృష్టరమని ఆయన అన్నారు. గత కాంగ్రెసు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ సభ్యులే వ్యతిరేకించడం విచారకరం, విడ్డూరం, ఆశ్చర్యకరమని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మంత్రివర్గమే ఆర్డినెన్స్ను ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. ఆర్డినెన్స్ విషయంలో గత ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని ఆయన అన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయలేకపోయిందని, దాంతో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేశామని చెప్పారు.

రెండు రాష్ట్రాలను సంప్రదించకపోవడం సరి కాదనే వాదనను ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీన జరిగిందని, దానికి ముందే ఆర్డినెన్స్ జారీ అయిందని ఆయన చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరం రూపు దిద్దుకోవాలని, ఇది 1980లో ప్రారంభమైందని, డెబ్బైఎనభై శాతం కాలువల నిర్మాణం పూర్తయిందని ఆయన అన్నారు. పోలవరం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదని, ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య అని, బాధితులకు ఎంత మంచి పునరావాసం కల్పించాలనే విషయంపై దృష్టి పెట్టడం అవసరమని ఆయన అన్నారు.
1956కు ముందూ వెనకా అనేది ముఖ్యం కాదని, దాన్ని వివాదం చేయవద్దని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications