ఎన్టీఆర్ ఘనతే: బాలకృష్ణ, బాబుపై ప్రశంసలు
హిందూపురం: బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అణగదొక్కుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని వర్గాలకూ రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఎన్టీ రామారావును ప్రశంసిస్తూనే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా ఆయన కితాబు ఇ్చచారు. ఐటి రంగానికి చంద్రబాబు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఇతర రంగాల్లో కూడా తమ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తుందని చెప్పారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. పేద, ధనిక తేడా లేకుండా అన్ని కులాలు, మతాల వారిని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తమ టిడిపియేనని ఆయన అన్నారు. తెలుగువారు ప్రపంచంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ అక్కడ తమ ఉనికినిచాటుకుంటున్నారని ఆయన కొనియాడారు. విదేశాల్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకుని తెలుగుజాతికి కీర్తిని తెస్తున్నారని అన్నారు.
తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. ప్రతి ఇంటికీ ఐటీ రంగం ఉపయోగపడే విధంగా చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. కృష్ణా జలాల ద్వారా అనంతపురం జిల్లా చెరువులు నింపుతామన్నారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తామన్నారు. ముఖ్యంగా రుణమాఫీని అమలు చేసి తీరుతామన్నారు.