నటి కాదంబరి కేసు విచారణ ప్రారంభం-శ్రవంతీ రాయ్ కు బాధ్యత-ముంబైకి టీమ్స్..?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ముంబై నటి కాదంబరి జెత్వానీపై సాగిన వేధింపుల వ్యవహారంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇవాళ ఉదయం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ శ్రవంతీ రాయ్ ను నియమిస్తూ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలు ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో గతంలో కాదంబరిపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ ప్రారంభమవుతోంది.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ముంబై నటి కాదంబరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పాటు ఇబ్రహీంపట్నం పీఎస్ లో తప్పుడు కేసు పెట్టి ఐపీఎస్ అధికారుల సాయంతో వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాదంబరి ఇవాళ మీడియా ఛానళ్ల ముందు ప్రత్యక్షమైంది. తనను 45 రోజుల పాటు ఎలా వేధింపులకు గురిచేశారో పూస గుచ్చినట్లు వివరించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం అసలేం జరిగిందో తేల్చాలని పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది.

హీరోయిన్ కాదంబరీ జెత్వానీపై ఇద్దరు ఐపీఎస్ ల సాయంతో వైసీపీ పెద్దలు వేధింపులకు దిగిన వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగింది. ఓవైపు ఎన్టీఆర్ కమిషనరేట్ ఇబ్రహీం పట్నం పీఎస్ లో నమోదైన తప్పుడు కేసుపై విచారణ ప్రారంభించింది. మరోవైపు ముంబైకి కూడా పోలీసు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు కాదంబరి కుటుంబాన్ని కలిసి ఏం జరిగిందో ఆరా తీయబోతున్నారు. ఇందులో లభించే సమాచారం ఆధారంగా మొత్తం ముగ్గురు ఐపీఎస్ లకు ఉచ్చు బిగియనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications