ఏపీ గవర్నర్ గా నజీర్ నియామకంపై అభ్యంతరాలు ? విజయసాయిరెడ్డి ట్వీట్
ఏపీ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం తాజాగా నియమించింది. దీనిపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కౌంటర్ ఇచ్చారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం తాజాగా ఏపీ గవర్నర్ గా నియమించింది. ఇప్పటివరకూ గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ స్ధానంలో రేపు నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో నజీర్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పనిచేయబోయే రెండో గవర్నర్ కాబోతున్నారు. ఇవాళ ఏపీ నుంచి రిలీవ్ అయి వెళ్తున్న ప్రస్తుత గవర్నర్ హరిచందన్ ను సీఎం జగన్ కలిసి ఘనంగా వీడ్కోలు పలకబోతున్నారు. అదే సమయంలో నజీర్ నియామకాన్ని ఏపీలో విపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయి. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఎందుకో విపక్షాలు నజీర్ నియామకాన్ని తప్పుబడుతున్నాయంటూ ఓ ట్వీట్ చేశారు.

ఏపీ గవర్నర్ గా జస్టిస్ నజీర్ ను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీలో విపక్షాలు స్వాగతించినా జాతీయ స్ధాయిలో విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలు తప్పుబట్టాయి. దీనిపై సాయిరెడ్డి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

సాయిరెడ్డి తన ట్వీట్ లో జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమించడాన్ని విపక్షాలు తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. అంతే కాదు గవర్నర్ గా ఎవరిని నియమించాలనే దానిపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 157లో స్పష్టంగానే ఉందన్నారు. దేశ పౌరుల్లో లబ్ద ప్రతిష్టులైన వారు ఎవరైనా గవర్నర్ గా నియమించేందుకు అర్హులేనన్నారు.

మరోవైపు ఏపీలో మాత్రం గవర్నర్ గా జస్టిస్ నజీర్ ను నియమించడాన్ని విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన స్వాగతించాయి. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇక్కడ గవర్నర్ నియామకాన్ని సమర్ధించినట్లయింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అయోధ్య, త్రిపుల్ తలాక్ వంటి చారిత్రక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో పనిచేసిన నజీర్ నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్, పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.












Click it and Unblock the Notifications