కార్యాలయాల తరలింపు వాయిదా..! మౌఖిక ఆదేశాలు: అధికారుల్లో డైలమా..!
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల వ్యవహారం అధికారికంగా ఆమోదం పొందే సమయం దగ్గర పడుతోంది. సోమవారం కేబినెట్ లో హైపవర్ కమిటి నివేదికకు ఆమోదం..ఆ వెంటనే అసెంబ్లీలో ప్రతిపాదించే దిశగా ప్రభుత్వం పక్కా కార్యాచరణ ఫిక్స్ చేసింది. ఇక, ఎన్ని అభ్యంతరాలు..రాజకీయ పార్టీలు విమర్శలు..అమరావతి ప్రాంతంలో నిరసనలు వ్యక్తం అవుతున్నా..ప్రభుత్వం ముందుకే అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో కొన్ని కీలక శాఖల్లో ముఖ్యమైన సెక్షన్ల తరలింపు పైన కొద్ది రోజుల క్రితం అవసరమైన చర్యలు తీసుకోవాలని..విశాఖలో వసతితో సహా అన్ని సౌకర్యాలను సిద్దం చేసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలు అందాయి. ఇప్పుడు అదే అధికారులు గతంలో ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా కొత్త సూచనలు చేస్తున్నారు. దీంతో..ఉద్యోగులు డైలమాలో కనిపిస్తున్నారు.
పలు విభాగాలకు మౌఖిక ఆదేశాలు
ఏపీలో ఇక నుండి విశాఖలోనే పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ప్రభుత్వ పట్టుదలతో కనిపిస్తోంది. దీంతో..కొన్ని కార్యాలయాల తరలింపు పైన కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వంలోని కీలక శాఖల్లోని ముఖ్య సెక్షన్ల తరలింపు పైన మౌఖిక ఆదేశాలు అందాయి. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే, ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలోని కార్యాలయాలను వివిధ కారణాల వల్ల సమీపంలోని అనువైన భవనాల్లోకి తరలించే ప్రయత్నాలను వాయిదా వేసుకోవాలని పలు విభాగాలకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వస్తున్నాయి. తదుపరి ఆదేశాలు అందే వరకు వేచి చూడాలని సూచిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికే నిర్దేశించిన కార్యాలయాలను తరలించాలని తొలుత నిర్ణయించారు. అయితే, అధికారికంగా ప్రభుత్వం విధానం పరంగా నిర్ణయం ఆమోదించక ముందే కార్యాలయాల తరలింపు మొదలు పెడితే ఎదురయ్యే ఇబ్బందుల పైనా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల తరువాత నిర్ణయం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

స్పష్టత వచ్చే వరకూ వాయిదా..
ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నా..అధికారిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ తరలింపు విషయంలో వేచి చూసే ధోరణితో ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి స్పష్టమయ్యే వరకు వేచి చూడాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలిని తాజాగా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. ఆఫీసు తరలింపు ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెల 20న తరలించాలని నిర్ణయించారు. అయితే మూడు రాజధానులపై ప్రభుత్వ వైఖరి స్పష్టమయ్యే వరకు వేచి చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఈ మేరకు తరలింపును తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇదేవిధంగా పలు కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications