ప్రాణాలు తీస్తున్న ఎలక్ట్రిక్ బైక్స్ - విజయవాడ నడి బొడ్డున: ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు..!
ఎలక్ట్రిక్ బైక్స్ బాంబుల్లా పేలుతున్నాయి. పలువురి ప్రాణాలు తీస్తున్నాయి. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైకుల్లోని బ్యాటరీలు పేలి.. మరణాలకు కారణమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఇదే రకమైన పేలుళ్లతో ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు.
బండి కొనుగోలు చేసిన రెండో రోజే...
తాజాగా.. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. శివకుమార్ అనే వ్యక్తి... నిన్ననే కొత్త ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేసినట్లు బంధువులు చెబుతున్నారు.
బెడ్రూమ్లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టగా... తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగటంతో ..శివకుమార్తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులు..మంటలు గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసారు. తలుపులను పగలకొట్టి లోపలకు వెళ్లి వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
భర్త మృతి ..భార్య-పిల్లలకు సీరియస్
ఆప్పటికే శివకుమార్ మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వరంగల్లో కూడా ఓ ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. స్కూటర్లలో అమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే పేలుడుకు కారణంగా తెలుస్తోంది.
ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదం జరిగే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ బైక్స్ వెంటనే లోపాలు ఉన్న తయారీ వాహనాలను రీకాల్ చేయాలని సంస్థలను ఆదేశించారు.
ప్రాణాలు తీసే బాంబుల్లా ఎలక్ట్రికల్ వాహనాలు
వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల పైన ఆయన ఆరా తీసారు. కాగా, ఈ ప్రమాదం పైన స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు... వారు చెప్పిన విషయాల ఆధారంగా బ్యాటరీ అమ్మిన షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బ్యాటరీకి సంబంధించిన టెక్నికల్ టీంను రప్పించి పేలుడుకు గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాటరీ తయారీ దారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.