ఆ విషయంపై పవన్ క్లారిటీ ఇచ్చేసినట్టేనా!!
కాకినాడ : తాడో పేడో తేల్చుకోవడానికి రంగంలోకి దిగుతాడనుకున్నా పవన్ కళ్యాణ్.. మరోసారి విషయాన్ని సాగదీసే ప్రయత్నమే చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాంటి ఆవేశంతోనే స్పీచును దంచికొట్టిన పవన్.. ప్రస్తుతానికి మాత్రం హోదాపై తన పోరాటం ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. ఏపీ ప్రజా ప్రతినిధులందరినీ దీనిపై పోరాటం చేయాల్సిందిగా హితవు పలికిన పవన్.. వాళ్లంతా విఫలమైతే ఆ తర్వాత మీ ముందు నేను జవాబుదారీగా ఉంటానని చెప్పుకొచ్చారు.
అంటే.. టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు హోదా తీసుకురావడం మావల్ల కాదని చేతులెత్తేస్తే.. అప్పుడు తాను రంగంలోకి దిగుతానని ప్రకటించారు పవన్. కాకినాడలో పవన్ ప్రసంగం తర్వాత ఇప్పుడు అందరి మదిలోను మెదులుతోన్న ప్రశ్న ఏంటంటే.. 'వాళ్లంతట వాళ్లు విఫలమయ్యామని ఎప్పుడు చేతలెత్తేయాలి..! అందుకోసం చూస్తూ కూర్చుంటే.. పవన్ ఎప్పుడు రంగంలోకి దిగాలి..?' ఇదీ ఇప్పుడు జనం నోళ్లలో నానుతున్న చర్చ.
ఇక బంద్ లు.. రాస్తారోకోలకు తానేమి పిలుపునివ్వడం లేదని.. వైసీపీ, సీపీఐ లాంటి పార్టీలు ఇచ్చిన బంద్ లో పాల్గొనడం.. పాల్గొనపోవడం మీ ఇష్టానికే వదిలేస్తున్నానన్నారు పవన్. అయితే.. ప్రజా ప్రతినిధులంతా ఉండగా.. ప్రజలెందుకు ఇబ్బందులు పడాలన్నది పవన్ లేవనెత్తిన ప్రశ్న. పదవుల్లో ఉన్నవారు హోదా కోసం పోరాటం చేయాలని, ఆపై.. వాళ్లు గనుక విఫలమైతే ఏం చేయాలో తనకు తెలుసునని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికిప్పుడు ఆమరణ దీక్ష లాంటివి చేసి.. ఓ పొలిటికల్ డ్రామాకు అవకాశమివ్వబోన్న పవన్.. హోదా విషయంలో ఏపీ నేతలంతా విఫలమైతే ఎలాంటి విధి విధానాలతో ముందుకు పోవాలనేది ఆలోచిస్తామన్నారు. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ఎలాంటి పంథాలో ఉద్యమం చేయాలన్నది తనకు తెలుసునున్నది పవన్ అభిప్రాయం.
పవన్ తన మాటల ద్వారా పరోక్షంగా ఇచ్చిన స్పష్టత ఏంటంటే.. హోదాపై పోరాటంలో ఏపీ నేతలు విఫలమైతే..! అప్పుడు తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నది పవన్ సుస్పష్టంగా చెప్పిన అంశం. దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు హోదాపై ఎలాంటి సీరియస్ నిర్ణయాలు తీసుకోబోనని పవన్ ఓ క్లారిటీ ఇచ్చేశారన్న వాదన వినిపిస్తోంది.