ప్రియురాలితో జల్సా కోసం.. పోలీసులకు అడ్డంగా దొరికాడు
చిత్తూరు: తాను ప్రేమించిన యువతితో జల్సాలు చేసేందుకు ఓ యువకుడు చిత్తూరు, కడప జిల్లాల్లో 22 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశాడు. చోరీ చేసిన వాహనంలో వెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు నిందితుడిని బుధవారం నాడు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. మనదపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సోమల మండలం సామిరెడ్డివారిపల్లెకు చెందిన మల్లికార్జున (19) బైక్ పైన వేగంగా వస్తుండగా పట్టుకున్నారు. అతను తీసుకొస్తున్న బైక్ రికార్డులు లేకపోవడంతో విచారిస్తుండగా పరుగెత్తేందుకు ప్రయత్నించాడు.

అతనిని పట్టుకొని విచారించారు. ఈ విచారణలో అతను ఏడాది కాలంలో మరో ఇరవై రెండు వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. మదనపల్లె, పుంగనూరు, తిరుపతి, కడపజిల్లాలోని రాయచోటి ప్రాంతాల్లో బైకులు చోరీ చేసినట్లు చెప్పాడు.
దొంగిలించిన వాహనాలను రూ.3వేల నుంచి రూ.5వేల వరకు విక్రయించేవాడు. మల్లికార్జున స్వగ్రామం కడప జిల్లా సుండుపల్లె మండలం దేవపట్ల. ఇతని తల్లి తండ్రి విడిపోవడంతో తన తాత ఉండే సోమల మండలంలోని సామిరెడ్డిపల్లెలో ఉంటున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.












Click it and Unblock the Notifications