Veerapuram:పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డల్లా చూసుకునే గ్రామం..విదేశీ పక్షుల అరుదైన కథ!
సత్యసాయి జిల్లా...వీరాపురం గ్రామం. ఈ ఊరు చాలామందికి తెలియకపోవచ్చుగానీ.. ఉమ్మడి అనంతపురం జిల్లా, దానికి సరిహద్దులోనే ఉన్న కర్నాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపూర్ ఇంకా చెప్పాలంటే ఒక్కింత బెంగళూరులో నివాసం ఉండే వారికి పరిచయమే. ఈ గ్రామం చిలమత్తూరు మండలం కిందకు వస్తుంది. లేపాక్షికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రామం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే... ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి గ్రామస్తుల్లో ప్రత్యేకత ఉంది. ఈ పల్లెటూరి వాతావరణంలో మరో ప్రత్యేకత ఉంది. ఈ మట్టివాసనకు ఇంకో స్పెషాలిటీ ఉంది. అందుకే ఏటా విదేశీ అతిథులు ఈ గ్రామంలో వాలిపోతుంటారు. ఇంతకీ ఎవరా విదేశీ అతిథులు.. ఏంటా ఊరుకున్న స్పెషాలిటీ..?
వీరాపురంలో విదేశీ పక్షులు
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి ఏటా విదేశీ పక్షులు వస్తుంటాయి. ఓ ఆరు నెలల పాటు ఈ గ్రామంలో సంచరిస్తూ సందడి చేస్తాయి. ఈ పక్షులను సైబీరియన్ కొంగలు అని పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం పెయింటెడ్ స్టార్క్స్ (Painted Storks).ఇవి సుమారు మూడు అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి.వీటి ముక్కు పసుపు రంగులో, రెక్కలు గులాబీ,నలుపు రంగుల కలయికతో చూసేందుకు చాలా అందంగా ఉంటాయి.ఈ సైబీరియన్ పక్షులు దాదాపుగా 6వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ వీరాపురం గ్రామానికి వలస వస్తాయి. ఈ గ్రామమే ఎందుకంటే.. ఇక్కడ వాటికి భద్రత చాలా బాగుంటుందని అవి భావిస్తాయట. ఏటా నవంబరు నుంచి జనవరి నెలల మధ్య ఈ పక్షులు వీరాపురంలో సందడి చేస్తాయి.

పురుడు కోసం వచ్చిన ఆడబిడ్డలు..
వీరాపురం గ్రామానికి చేరుకున్న తర్వాత ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. ఈ గ్రామంలో చెట్లు విరివిగా ఉంటాయి. అందువల్ల ఏ చెట్టు చూసిన ఈ పెయింటెడ్ స్ట్రాక్స్ పక్షుల గూళ్లు కనిపిస్తాయి. ఈ పక్షులను గ్రామస్తులు ఎంతో ప్రేమిస్తారు. ఏ పక్షికి ఎలాంటి హాని తలపెట్టరు. అదే సమయంలో ఈ పక్షులను పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావిస్తారు గ్రామస్తులు. ఇక ఈ గ్రామస్తుల గొప్పమనసు గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ పక్షులు వచ్చిన సమయంలో గ్రామంలోని వారంతా చాలా నిశబ్దంగా ఉంటారు. పండుగల సమయంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ బాణాసంచా, బ్యాండు మేళాలతో సందడిగా కనిపిస్తే వీరాపురం గ్రామంలో మాత్రం అలాంటివేమీ కనిపించవు. ఈ పక్షులు బెదిరిపోతాయేమోనని ఇలాంటి సందళ్లు, పండగలకు దూరంగా ఉంటారు.
పక్షుల కోసం గ్రామస్తుల త్యాగం
ఇక ఆ పక్షులు కూడా వీరాపురం గ్రామానికే ఎందుకొస్తాయంటే... వాటి పిల్లలకు ఈ గ్రామమే సరైన భద్రత అని భావిస్తాయట. పిల్లలు పుట్టాక అవి ఎగిరేందుకు సుమారు ఐదారు నెలలు సమయం పడుతుంది. అప్పటి వరకు వీటిని తల్లి పక్షులు జాగ్రత్తగా కాపాడుకుంటాయి.ఇక ఈ గ్రామస్తులు వీటి ఆహారం కోసం చేపలను పెంచుతారు. ఈ గ్రామంలో చెరువులు కూడా ఉండటంతో ఈ సైబీరియన్ పక్షులకు ఆహార కొరత కూడా ఉండదు. వ్యవసాయమే ఆధారంగా చేసుకుని జీవనం చేసే గ్రామస్తులు ఈ ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు చెరువు నుంచి నీరును సాకుకోసం వినియోగించరు. ఎందుకంటే చెరువులో నీరు కనుక అడుగంటితే అందులోని జీవరాశులైనటువంటి చేపలు ఇతరత్రా కీటకాలు చనిపోతాయి. వాటి పైనే ఆహారం కోసం ఆధారపడే సైబీరియన్ పక్షులకు తిండి దొరకదు.ఇక్కడ కూడా గ్రామస్తులు త్యాగం స్ఫూర్తిదాయకం. ఒక వేళ చెరువు ఎండిపోతే ఇంకాస్త దూరంలో మరో చెరువుందని అక్కడికి వెళ్లి దాహార్తి తీర్చుకుని తిరిగి గ్రామానికి వస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఆగష్టు నెలలో గుడ్ బై చెప్పనున్న పక్షులు
ఇక జూలై నెలాఖరు లేదా ఆగష్టు తొలివారంలో ఈ ప్రత్యేక అతిథులైన సైబీరియన్ పక్షులు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపి తమ సొంత దేశానికి పయనమవుతాయి.అప్పటికే వాటి పిల్లలకు కూడా ఎగిరేందుకు రెక్కలు వచ్చి ఉంటాయి కనుక..పుట్టింటిని వీడి మెట్టినింటికి వెళతాయి. ఈ పక్షులు ఉన్న ఆరునెలల పాటు వాటి కిలకిల రావాలతో సందడిగా కనిపించే వీరాపురం గ్రామం.. అవి గూళ్లను ఖాళీ చేసి వెళ్లాక ఒక నిశబ్ద వాతావరణం అలుముకుంటుంది. గ్రామస్తులు కూడా వాటితో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ మళ్లీ వాటి రాకకై ఎదురు చూస్తూ ఉంటారు. పర్యాటకుల సందడి ఆ గ్రామంలో కనిపించకపోవడంతో ఏదో వెలితిగా కనిపిస్తుంది. ఇదండీ... ఈ విదేశీ అతిథులపై ప్రత్యేక కథనం. ఈ పక్షులను చూడాలనుకునే పక్షి ప్రేమికులు వీరాపురం గ్రామానికి త్వరగా వెళ్లండి. లేదంటే ఈ అద్భుతమైన దృశ్యాలను, ఆ పక్షులు చేసే సందడిని చూడాలంటే మళ్లీ డిసెంబర్ జనవరి వరకు వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications