వచ్చే ఎన్నికల్లో అదే జగన్ బ్రహ్మస్త్రం - అందరివాడుగా నిలిచేందుకు : ఇదీ లెక్క..!!
ముఖ్యమంత్రి జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ - లోక్ సభ సీట్ల కేటాయింపులో అనూహ్య సమీకరణాలను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రతిపక్షం ఆ వ్యూహం అర్దం చేసుకొనే లోగా నామినేషన్ల సమయం ముగిసిపోయింది. ఆ సమీకరణాలే 151 సీట్ల మెజార్టీకి దోహదం చేసాయి. అధికారంలోకి వచ్చాక..కొత్త లెక్కలతో జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రతీ ఒక్కరికీ మేలు చేయాలి.. ఏ వర్గం వివక్షకు గురి కాకూడదనేది తన విధానమని సీఎం జగన్ స్పష్టం చేసారు.
సామాజిక న్యాయమే అస్త్రంగా
అందులో భాగంగానే.. తన తొలి కేబినెట్ లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంటే 25 మంది మంత్రుల్లో 70 శాతం బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందునా.. బీసీ - ఎస్సీ- ఎస్టీ -కాపు - మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమలు చేస్తున్నారు. చట్టాలతో సరి పెట్టకుండా..స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనిని అమలు చేసి చూపించారు. తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన పదువల్లోనూ 50 శాతం మహిళలకే కేటాయించారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
స్థానిక సంస్థల పదవుల్లో భాగంగా.. మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం దక్కాయి. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చారు. రాష్ట్రంలోని 13 నగర పాలక సంస్థల్లో 13 మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చారు. ఇక, కేబినెట్ మలి విడత విస్తరణలో భాగంగా.. కొత్త కేబినెట్లో బీసీలకు పెద్దపీట వేశారు. ఏకంగా 10మంది బీసీలకు చోటుకల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించారు. బీసీలకు 10, ఎస్సీలకు- 5, ఎస్టీలు, మైనారిటీలకు చెరొకటి, కాపు-రెడ్డి సామాజిక వర్గాలకు చెరో నాలుగు పదవులు కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా పదిమంది బీసీలకు మంత్రి పదవులు కేటాయించారు.
అగ్ర వర్ణాలకు కార్పోరేషన్లు
బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదా లో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. వైశ్య వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్ర స్వామికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పది కేటాయించారు. క్షత్రియ వర్గానికి చెందిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. శాసనమండలిలో ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు ఛైర్మన్ గా.. మైనార్టీ వర్గానికి చెందిన మహిళను డిప్యూటీ ఛైర్మన్ ను ఎంపిక చేసారు. అగ్ర వర్ణాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసారు. ఎవరూ ఊహించని విధంగా.. ఒకేసారి కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇలా...అన్ని ప్రాంతాలు..అన్ని సామాజిక వర్గాల సమతుల్యతతో వైనాట్ 175 నినాదంతో..సామాజిక న్యాయం అనే బ్రహ్మస్త్రంతో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నారు.












Click it and Unblock the Notifications