షర్మిల సెల్ఫ్ గోల్ - వైసీపీ చేతికి కొత్త అస్త్రం..!!
ఏపీలో షర్మిల రాజకీయం మొదలు పెట్టారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రసంగంలోనే సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసారు. బీజేపీకి ఈ రెండు పార్టీలు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అసలు బీజేపీతో కలిసిన పవన్ గురించి ప్రస్తావనే చేయలేదు. తెలంగాణలో పార్టీ నడిపిన సమయంలో కాంగ్రెస్ పైన షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో షర్మిల తన రాజకీయ ప్రత్యర్ధుల చేతికి అస్త్రం అందించారు.
షర్మిల వ్యాఖ్యలతో
షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గలు స్వీకరించిన వేళ కొత్త చర్చ మొదలైంది. వైఎస్సార్ వారసురాలిగా చెబుతూ తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసారు. మరి..వైఎస్సార్ ఊపరి, ఆశయాలు కాంగ్రెస్ అని చెబుతున్న షర్మిల నాడు కొత్త పార్టీ ఎందుకు స్థాపించారు. నాడే కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదు. సొంత పార్టీ నడపలేక చేతులెత్తేసి కర్ణాటక నేతల సూచనతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. తెలంగాణ కోడలిగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనేనని నాడు ప్రకటించారు. వైఎస్సార్ విశ్వసనీయతకు మారు పేరు. ఆయన పేరుతో రాజకీయం చేస్తున్న షర్మిల నాడు తెలంగాణ ప్రజలకు ఏమని మాట ఇచ్చారు. కానీ, ఏం చేసారు. తన జీవితం ఇక తెలంగాణలోనే అని చెప్పి ఏకంగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్నే వదిలేసి..ఏపీనే తన లక్ష్యమని చెబుతున్నారు.

తెలంగాణలో ఏం చెప్పారు
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ పైన షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగలు, బ్లాక్ మెయిలర్లు సీఎంలు కాలేరు అంటూ పరోక్షంగా విమర్శించారు. అదే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ లో షర్మిల రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. కనీసం రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిలకు ఆహ్వానం లేదు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ రహస్య మిత్రులని బహిరంగంగానే చెప్పకుంటున్నారు. ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక అంతర్యం ఏంటన్నది ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్న అంశం. వైఎస్సార్ మరణం గురించి హేళనగా మాట్లాడిన అదే రేవంత్రెడ్డితో షర్మిల కలిసిపోయారు.
ఏపీలో ఏం చేయబోతున్నారు
టీడీపీ మద్దతు మీడియాకు షర్మిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలోనే తన భవిష్యత్ రాజకీయం, చివరి నిమిషం వరకు అక్కడే ఉంటానంటూ ఆ రాష్ట్ర ప్రజలకు షర్మిల మాట ఇచ్చారు. కానీ, ఏం చేసారు. ఇప్పుడు ఏపీలో మాత్రం షర్మిల ఏం చేయబోతున్నారు. షర్మిల లక్ష్యం ఏంటనేది అందరికీ సుస్పష్టం. తెర వెనుక ఎవరున్నారనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు షర్మిల అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ కుమార్తెగా ఆయన ఆశయాలు కొనసాగిస్తానని చెబుతున్న షర్మిల..అసలు వైఎస్సార్ సమైక్య వాదా..విభజనవాదా అనేది గుర్తు చేసుకోవాలని నెటిజెన్లు సూచిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్న షర్మిల తీరు రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications