జగన్వి పగటి కలలే! ఈ జన్మలో అది జరగదు: మంత్రి పల్లె జోస్యం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'త్వరలోనే తాము అధికారంలోకి వస్తాం. ప్రజల కష్టాలు తీరుస్తాం. కట్రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం'అని జగన్ ఎక్కడికెళ్లినా ఊదరగోడుతున్నారంటూ మండిపడ్డారు.
మంగళవారం రాత్రి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఈ జన్మకు సీఎం కాలేరని జోస్యం చెప్పారు.

'ముఖ్యమంత్రి పదవి కోసం వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పగటి కలలు కంటున్నారు. ఎన్ని గడపలు తట్టినా... ఎన్ని యాత్రలు చేసినా ఈ జన్మకు ఆయన సీఎం కాదు కదా.. మరోసారి ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాలేరు' అని పల్లె జోస్యం చెప్పారు.
'కోట్ల అవినీతి చేసి దేశానికి ద్రోహం చేసిన జగన్ లాంటి వ్యక్తి ఇంటింటికీ వస్తున్నానంటూ చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో నిలదీయాలి. అసమర్థుడు, అవినీతిపరుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు జగన్ను తిరస్కరించారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఆస్తులను ఈడీ జప్తుచేసింది. మరోవైపు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే దిక్కుతెలియక జగన్ అయోమయంలో ఉన్నారు' అని ఎద్దేవా చేశారు.
కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఐదేళ్ల పాలనకోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తే టర్కీ ప్రజలు అక్కడి సైనిక తిరుగుబాటుదారులకు బుద్ధిచెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు సమాధానం చెబుతారని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పుడు మాట్లాడినా ఏడాదిలో ఎన్నికలొస్తాయని, ఆ తర్వాత తానే సీఎంనని చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఒకట్రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ సోమవారం విశాఖలో చేసిన వ్యాఖ్యలపై డొక్కా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.
గుర్తుండిపోయేలా జెండా పండగ: సునీత, పల్లె
చరిత్రలో గుర్తుండిపోయేలా రాష్ట్ర స్థాయి స్వాంతంత్య్ర దినోత్సవాలను అనంతపురం నగరంలో నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి వేడుకలను అనంతలో నిర్వహించే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించారన్నారు.
వేడుకలు నిర్వహించే పోలీసు శిక్షణ కళాశాల, నీలం సంజీవరెడ్డి స్టేడియాలను మంగళవారం మంత్రులు.. కలెక్టర్ శశిధర్, డీఐజీ ప్రభాకర్రావు, ఎస్పీ రాజశేఖరబాబులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు. మంత్రి సునీత మాట్లాడుతూ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, ఉ న్నతాధికారులు హాజరవుతారన్నారు.
వేదిక ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. వీవీఐపీల భద్రత, శకటాల నడక, ఇతర కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. 70వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లాలో నిర్వహించడం అదృష్టమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.అధికారులు సమష్టి కృషితో విజయవంతంగా నిర్వహించాలన్నారు.












Click it and Unblock the Notifications