ఎస్పీ ఆఫీస్ బాత్రూమ్లో టీడీపీ ఎమ్మెల్యే.. అసలేం జరిగింది?
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం ఒక హై-వోల్టేజ్ డ్రామాకు వేదికైంది. తన మాట నెగ్గించుకోవడం కోసం అధికార పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఏకంగా పది గంటల పాటు ఎస్పీ ఛాంబర్ను వీడకుండా మొండికేశారు. చివరికి బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో, పోలీసులు తలుపులు పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎస్పీ బి.కృష్ణారావును కలిసేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. జిల్లా పోలీసు సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఖరారు చేయలేదని ఆయన నిలదీశారు. ఎనిమిది నెలల క్రితమే లేఖ ఇచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం విచారణ చేసి సంతకం చేస్తానని ఎస్పీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఎమ్మెల్యే వినిపించుకోకుండా పెద్దగా కేకలు వేయడంతో ఆఫీసు ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

బాత్రూమ్లో బందీ.. డంబెల్స్తో తలుపుల ధ్వంసం!
ఎమ్మెల్యే పట్టుదలకు తలొగ్గిన ఎస్పీ, చివరికి సిఫారసు లేఖపై సంతకం చేసి డీజీపీ కార్యాలయానికి పంపారు. అయితే, నియమక ఉత్తర్వు (Appointment Order) తన చేతికి వచ్చే వరకు కదిలేది లేదని ఎమ్మెల్యే అక్కడే భీష్మించుక కూర్చున్నారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 7 గంటల సమయంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇతర టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు అనూహ్యంగా ఎస్పీ ఛాంబర్లోని బాత్రూమ్లోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు. మంత్రులు లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా ఆయన స్పందించలేదు. చివరకు గత్యంతరం లేక పోలీసులు డంబెల్స్ సాయంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చారు.
అంతకుముందు ఆర్డీవో ఆఫీసులోనూ అదే సీన్!
కేవలం ఎస్పీ ఆఫీసులోనే కాకుండా, అంతకుముందు ఉదయం ఆర్డీవో కార్యాలయంలోనూ ఎమ్మెల్యే ఇలాంటి డిమాండే చేశారు. తన అనుచరుడు గోపికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ఆర్డీవో బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని ఆర్డీవో వివరించినప్పటికీ, సుమారు గంటపాటు అక్కడ రాద్ధాంతం చేసి, హామీ పొందిన తర్వాతే అక్కడి నుంచి కదిలారు.
సుఖాంతమైన ఉత్కంఠ
బుధవారం సాయంత్రం లోపు నియామక పత్రం అందజేస్తామని ఐజీ నుంచి హామీ లభించడంతో, రాత్రి 9:45 గంటల సమయంలో ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. పది గంటల పాటు సాగిన ఈ రాజకీయ ఉత్కంఠ పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications