"పప్పు" పదం నిషేధం : రోజా - కొడాలి నాని కంట్రోల్ అవుతారా : అసెంబ్లీ కీలక నిర్ణయం..!!
"పప్పు" ఈ పదం కొద్ది రోజుల క్రితం వరకూ జాతీయ- ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించింది. కానీ, ఇప్పుపడు ఈ పదం ప్రయోగించటం పైన ఏకంగా అసెంబ్లీలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పదాన్ని ఇక అసెంబ్లీలో వాడకూడదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో..ఏపీలో వైసీపీ నేతలు సైతం ఇదే ఫాలో అవుతారా..వారి నోటికి తాళం పడుతుందా అనే చర్చ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీని అవహేళన చేసేందుకు ఈ పదం తరచూ ఉపయోగించేవారు. దీని పైన కాంగ్రెస్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.
జాతీయ స్థాయిలో రాహుల్ పైన బీజేపీ..
బీజేపీ నేతలు ఆ రకంగా వ్యంగంగా తమ పార్టీ నేతను అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ తిప్పి కొట్టొంది. ఇక, ఏపీలో సైతం మాజీ మంత్రి లోకేశ్ పైన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా...మంత్రి కొడాలి నానితో పాటుగా పలువురు వైసీపీ నేతలు ఇదే పదం ప్రయోగిస్తూ టార్గెట్ చేసేవారు. ప్రస్తుతం జగన్ తో విభేదించి..తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల సైతం 2019 ఎన్నికల ప్రచార సమయంలో ఇదే పేరుతో మంగళగిరిలో లోకేశ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే, ఆ సమయంలో వైసీపీ నేతలు మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఏపీలో లోకేశ్ లక్ష్యంగా వైసీపీ...
ఇది తాము చెబుతున్న అంశం కాదని... గుగూల్ లోకి వెళ్లి లోకేశ్ అనే పేరు సెర్చ్ చేస్తే "పప్పు" అనేది వస్తుందని రోజా లాంటి వారు వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వారు చూపించారు. అసెంబ్లీ లోపలా-బయటా చంద్రబాబు ..ఆయన తనయుడ పైన విమర్శలు చేసే సమయంలో మంత్రి కొడాలి నాని తరచుగా ఈ పదం వాడుతారు. ఇక, ఈ పదం వాడటానికి వీళ్లేదంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మధ్యప్రదేశ్ శాసన సభ కీలక నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ కీలక నిర్ణయం..
పప్పు, చోర్, మిస్టర్ బంటాధార్, వెంటిలేటర్ వంటి పదాలు, వాక్యాలను సభలో పలకకుండా నిషేధం విధించింది. ఏయే పదాలను సభలో వాడకూడదో పేర్కొంటూ జాబితాను అసెంబ్లీ స్పీకర్ జారీ చేశారు. మొత్తంగా 1954 నుంచి ఇలా నిషేధిస్తూ వస్తున్న పదాలు, వాక్యాల సంఖ్య 1161కి చేరింది. ఇందుకు సంబంధించి 38 పేజీల బుక్లెట్ను సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రిలీజ్ చేసారు. ఇక, ఈ నిర్ణయం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో... బీజేపీ ప్రభుత్వ హాయంలో తీసుకున్నారు. కానీ, ఏపీలోనూ ఈ పదం పైన వివాదం నెలకొని ఉంది.
ఏపీలోనూ నిషేధిస్తారా..సాధ్యమేనా..
దీంతో..ఇక్కడ సైతం ఈ పదం అసెంబ్లీలో వాడటానికి వీళ్లేకుండా చర్యల కోసం టీడీపీ డిమాండ్ చేస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. టీడీపీ ఇప్పుడు స్పందిస్తే... వైసీపీ నుంచి మరలా అదే పదం పైన చర్చ -విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుంనే భావన వ్యక్తం అవుతోంది. వదిలేస్తే...ఈ పదం పైన బయటే కాకుండా.. చట్ట సభల్లోనూ పదే పదే వినాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు టీడీపీ నేతలు ఇటువంటి అభ్యర్ధనలు చేసినా..వాటికి ఎంత వరకు ఆమోదం లభిస్తుందనేది సందేహమే.
Recommended Video
రోజా - కొడాలి నాని తరచూ లోకేష్ పైన ఇలా..
అయితే, ఈ పదం పైన ఏకంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవటం మాత్రం ఏపీలోనూ చర్చకు కారణమైంది. దీని పైన ఏపీలోని టీడీపీ నేతలు స్పందించినా.. లేకున్నా.. వైసీపీ నేతలు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తారా..లేక, ఒక అసెంబ్లీనే ఆ పదాన్ని సభలో వాడకూడదని నిర్ణయించటంతో...స్వీయ నియంత్రణ ఇక్కడా పాటిస్తారా అనేదే హాట్ టాపిక్. వైసీపీ నేతలు ప్రధానంగా రోజా ...మంత్రి కొడాలి నాని ఈ పదం ప్రయోగించకపోతే టీడీపీకి పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇక... ఇప్పుడు ఈ పదం పైన ఏపీలో ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.