రాజధాని: బెజవాడలో నేతల ఇళ్ల వేట, జగన్ కూడా...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడ ఉంటుందనే వార్తలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు రాజకీయ రాజధాని అయిన విజయవాడలో ఇల్లు వెతుక్కునే పనిలో పడ్డారు. రాజధాని విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ విజయవాడ కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం విజయవాడలోని భారతినగర్లో ఓ ఇంటిని వెతికారని సమాచారం. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే విజయవాడలోని పిన్నమనేని ఆస్పత్రి పరిసరాలలో ఒక ఇంటిని తీసుకున్నట్టు చెబుతున్నారు.

అలాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయవాడ మొగల్రాజపురంలో ఓ ఇంటిని చూసుకున్నారట. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్లు కూడా విజయవాడలో ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారట. జగన్ నివాసం పైన కూడా చర్చ జరిగిందట. అయితే, రాజధాని ప్రాంతం ఖరారైన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ భావించిందట.
మరోవైపు, పార్టీలు కూడా కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సన్నద్దమైన విషయం తెలిసిందే. విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ కూడా త్వరలో కొత్త కళను సంతరించుకోనుంది. ఆంధ్రరత్న భవన్ను ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆఫీస్ కింద మార్చాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీనిని రూ.3కో ట్లతో పునరుద్ధరించనున్నారు. ఇది గవర్నర్పేటలో ఉంది.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం సూర్యారావుపేటలో ఉంది. సీపీఐ హనుమాన్పేటలో నూతన భవనాన్ని నిర్మించి అక్కడి నుండి పార్టీ వ్యవహారాలు నడుపుతోంది. బందరు రోడ్డులో సీపీఎం కొత్త భవనం నిర్మిస్తోంది. లోక్సత్తా కార్యాలయం కూడా ఏర్పాటవుతోందట. టీడీపీకీ విజయవాడలో సొంత కార్యాలయం లేదు. ఎంపీ కేశినేని సొంతగా భవనాన్ని నిర్మించి నగర పార్టీ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications