జగన్ కేసుల విచారణ మళ్లీ మొదటికే, తాజా నిర్ణయంతో ఇక..!!
మాజీ సీఎం జగన్ కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చివరి సారిగా జగన్ గత నెల 20న కోర్టు ముందు హాజరయ్యారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తుల అభియోగాలతో జగన్ పైన కేసులు నమోదు చేసారు. 11 కేసుల్లో విచారణ కొనసాగుతోంది. జగన్ ఈ కేసుల సమయంలో గత ఆరేళ్ల కాలంలో ఒక్క సారి మాత్రమే కోర్టుకు నేరుగా హాజరయ్యారు. అయితే, ఇప్పుడు చోటు చేసుకున్న తాజా పరిణామం జగన్ కేసుల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
మాజీ సీఎం జగన్ కేసులు విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత న్యాయాధికారి ఈ నెల 22 తర్వాత రిలీవ్ కావాలని, 29వ తేదీ లోగా నూతన వ్యక్తి పోస్టింగ్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మార్ పుతో జగన్ అక్రమాస్తుల కేసు విచారణను మరోసారి కొత్త న్యాయాధికారి ప్రారంభించనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో కూడా పలుమార్లు న్యాయాధికారులు మారడంతో విచారణ ప్రతిసారి మొదటి నుంచి ప్రారంభమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ఇప్పటికీ పూర్తికాలేదు.

ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్నా, ప్రధాన కేసులు ట్రయల్ దశకు వెళ్లలేదు.దీనికి కారణం పదేపదే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ పైన పలు పిటీషన్లు దాఖలయ్యాయి. కాగా.. జగన్ డిశ్చార్జ్ పిటీషన్ల కారణంగా కేసు ముందుకు సాగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ కేసులకు సంబంధించి 2013 నుంచి ఇప్పటి వరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. అయితే, విచారణ పూర్తి కాక ముందే వారంతా బదిలీ అయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి రఘురాం సైతం బదిలీ అయ్యారు. దీంతో, ఈ కేసుల విచారణ తిరిగి మళ్లీ మొదటికి వచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications