రేపు పవన్ కళ్యాణ్ చేతికి జాబితా: జనసేన వైపు చూడకుండా ఆ 'ఇద్దరి' జాగ్రత్తలు
Recommended Video

అమరావతి: జనసేన పార్లమెంటరీ కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. నేతలు, కేడర్కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 25 పార్లమెంటరీ స్థాయి పార్టీ కమిటీలలో స్థానిక నేతలకు స్థానం కల్పిస్తూ తుది జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రేపు తుది జాబితాను పరిశీలించనున్నారు.
ఈ నెల 20వ తేదీన జనసేనాని కమిటీలను ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు జనసేన ఓ ట్వీట్ చేసింది. పార్టీ కమిటీల ఎంపిక దాదాపు పూర్తయిందని, ఈ నెల మూడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు విజయవాడలో జరిగిన జిల్లాల సమీక్ష సమావేశాల్లో కమిటీల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, జాబితాలకు సీనియర్ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నారని, మా నాయకులు, కేడర్కు వేర్వేరుగా కమిటీలను నియమించాలని పవన్ ఆదేశించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రానికి తుది జాబితాను జనసేనానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. పరిశీలన తర్వాత నియామకాలను ప్రకటిస్తారన్నారు.
విదేశీ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీ పైన దృష్టి సారించారు. వరుసగా జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాల్లోని సమస్యలు తెలుసుకుంటున్నారు. త్వరలో జిల్లాల్లో కూడా పర్యటించి స్థానిక సమస్యలపై అవగాహన కల్పించుకోనున్నారు.

అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి
అదే సమయంలో, పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనే అంశంపై కూడా దృష్టి సారించారు. 175 నియోజకవర్గాలు, 25 లోకసభ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశముంది. అయితే, వామపక్షాలతో పొత్తు కుదిరితే కొన్ని సీట్లు వారికి కేటాయిస్తారు. కానీ, ఏపీలో ముఖ్య పార్టీలైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పొత్తుకు జనసేనాని సిద్ధంగా లేరు.

సీనియర్లకు కూడా పవన్ కళ్యాణ్ రెడ్ కార్పెట్
పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో బ్యాలెన్స్గా టిక్కెట్ ఇచ్చే అంశంపై దృష్టి సారించారు. కొత్తగా స్థాపించిన పార్టీ కాబట్టి సీనియర్లకు, అలాగే కొత్త తరానికి అవకాశమివ్వాలి కాబట్టి ఉత్సాహవంతులైన యువతకు, అలాగే పార్టీ పట్ల, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వారికి ఇవ్వాలని చూస్తున్నారు. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నందున కేవలం యువతతోనే నెగ్గుకు రాలేమని భావించి సీనియర్లకు కూడా ఆయన రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఏరికోరి తీసుకోనున్నారని తెలుస్తోంది.

పార్టీలోకి వచ్చే అవకాశం
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో దాదాపు వందకు పైగా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్లుగా తెలుస్తోంది. క్లిష్టంగా ఉన్నచోట షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నారు. అయితే చాలాచోట్ల టీడీపీ, వైసీపీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అసంతృప్తులు జనసేన వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ ప్రకటించిన తర్వాతే అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వైపు చూడకుండా చంద్రబాబు, జగన్ జాగ్రత్త
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలలో టిక్కెట్ ఆశించి రాని వారు జనసేన వైపే ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. పవన్ కూడా కొన్ని స్థానాలల్లో సీనియర్ల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎవరైనా తమ పార్టీలకు చెందిన నేతలు ఇతర పార్టీల వైపు ముఖ్యంగా, జనసేన వైపు చూస్తారనే ఆందోళనతో టీడీపీ, వైసీపీలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి ముఖ్యంగా అభ్యర్థుల కొరత ఉంటుంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీల్లో టిక్కెట్ రాకుంటే అసంతృప్తి నేతలు చూసేది జనసేన వైపే అంటున్నారు. కాబట్టి చంద్రబాబు, జగన్ జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications