"వాన్ని చంపేద్దామనుకున్నా! త్వరలో పాదయాత్ర, తప్పు చేస్తే శిక్షించండి"
అనంతపురం : అనంతలో కరువు, నిరుద్యోగం, వనరుల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నానంటూ ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పాదయాత్ర చేయాలన్న ఆలోచన తన మనసులో ఎప్పటినుంచో ఉందని, కష్టంతో కూడుకున్నదైనా సరే పాదయాత్రతో జిల్లాలో పర్యటిస్తానని స్పష్టం చేశారు.
అనంతలో కరువు, నిరుద్యోగ పరిస్థితులపై పలువురు విద్యార్థులు ప్రశ్నలు అడుగుతున్న సందర్బంలో.. ఈ ప్రకటన చేసి ముగించారు పవన్. తన పర్యటన ద్వారా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు. అనంతపురంను సస్యశ్యామలం చేయాలంటే.. ముందు 'కరువు' అన్న ఆలోచనను పక్కనబెట్టి.. ప్రత్యామ్నాయంగా ఏంచేస్తే.. జిల్లాకు మేలు చేకూరుతుందో ఆలోచించాలని యువతకు పిలుపునిచ్చారు పవన్.

ప్రత్యేక హోదాపై ఏమన్నారు?
'ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తానన్న మీరు.. ఎందుకు ఆ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గారు?' అన్న ప్రశ్నకు బదులుగా.. తానెప్పుడు సమస్యలకు వెన్ను చూపనని, అందుకే ఇప్పటికీ మీ ముందుకొచ్చి సమాధానం చెబుతున్నానని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితులను, ప్రత్యర్థుల వ్యూహాలను అంచనా వేస్తూ.. ప్రణాలికలు మార్చుకోవాల్సి ఉంటుందంటూ బదులిచ్చారు పవన్.

పెళ్లిళ్ల గురించి ఆసక్తికరంగా :
తాను పుస్తకాల్లో చదువుకున్నదానికి.. కళ్లముందు కనిపిస్తున్న సమాజానికి చాలా వ్యత్సాసం ఉండేదని.. దాంతో ఒక్కడినే కూర్చుని తీవ్రంగా ఆలోచించేవాడినని చెప్పారు పవన్. ఇదే క్రమంలో పెళ్లి పెటాకులు లాంటివి లేకుండా సన్యాసిగా ఉండిపోవడానికి నిర్ణయించుకున్నానని, కానీ అనుకోకుండానే 'పెళ్లిళ్లు' చేసుకోవాల్సి వచ్చిందని సరదా వ్యాఖ్యలు చేశారు.

ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి; వాన్ని చంపేద్దామనుకున్నా :
అర్ధరాత్రి సైతం ఆడవాళ్లు స్వేచ్చగా తిరగ్గలగాలని పవన్ అభిప్రాయపడ్డారు. తమను అవమానపరిచే ఆకతాయిలకు అవసరమైతే చెప్పు దెబ్బతో బుద్ది చెప్పాలన్నారు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు అక్క పట్ల ఓ రౌడీ వ్యవహరించిన తీరు చూసి చంపేద్దామనుకున్నానని పవన్ ఉద్వేగంగా చెప్పారు. అయితే చుట్టూ ఉన్న సమాజం నిస్సహాయంగా ఉండిపోవడం తనను బాధించిందన్నారు పవన్. బలహీనుల తరుపున ప్రశ్నించడానికే జనసేనను పెట్టినట్టుగా పేర్కొన్నారు పవన్.

నేనేం చేయగలను? తప్పు చేస్తే నన్నైనా శిక్షించండి?
తప్పు చేస్తే తననైనా సరే శిక్షించాలని.. అలాంటి పరిపాలనను తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు పవన్. ప్రతీ ఒక్కరు దేశానికి, రాష్ట్రానికి నేనేం చేయగలను? అని ప్రశ్నించుకుని తమవంతుగా ఏమైనా చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా ఆలోచించాను గనుకనే ఈరోజు జనసేనతో ప్రజలకు ఏదైనా మంచి చేయాలని జనంలోకి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications