రైతులకు అండగా నిలుస్తా: సీమ..ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారు: ఏ రోజైనా ప్రభుత్వం కూలిపోతుంది.. పవన్
అమరావతి ప్రాంతాల రైతులకు అండగా నిలుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమరావతి రైతులకు అన్యాయం చేయకుండా రాజధాని కదిలిస్తామని చెబితే..తాను అప్పుడు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. రాజధాని ఎక్కడో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రజలను మభ్య పెట్టి ప్రాంతీయ విభేదాలను ప్రోత్సహిస్తున్నా రని ప్రభుత్వం పై మండిపడ్డారు. అధికారం శాశ్వతం అనుకుంటే పొరపాటని..ఏ సమయంలో అయినా ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలతో ఉత్తరాంధ్ర..రాయలసీమ ప్రజలను మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ నాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా అంగీకరించిన తరువాతనే రైతులు భూములు ఇచ్చారని పవన్ గుర్తు చేసారు. మాట తప్పటం న్యాయం కాదన్నారు. రాజధాని అంశం పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే తన కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేసారు.
అటు సీఎం జగన్..ఇటు పవన్: రాజధాని గ్రామాల్లో హై అలెర్ట్: భారీగా పోలీసు బలగాలు..!
అమరావతిపైన ఎందుకు జగన్ కు కక్ష్య..
జనసేన అధినేత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం లో రైతుల దీక్షలో పవన్ పాల్గొన్నారు. జగన్ కు రాజధాని పైన ఎందుకింత కక్ష్య అని ప్రశ్నించారు. నాడు అసెంబ్లీ సాక్షిగా జగన అమరావతికి మద్దతిచ్చారని..ఆ తరువాతనే రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేసారు. ఇప్పుడు మాట తప్పటం ధర్మం కాదన్నారు. అమరావతి బాండ్లు వచ్చినాక.. సీఆర్డీఏ చట్టం చేసిన తరువాత ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో తుఫాన్లు వచ్చిన సమయంలో వీరికి ఆ ప్రాంతం గుర్తుకు రాలేదని..ఇప్పుడు ప్రేమ మొదలైందని ఎద్దేవా చేసారు. ప్రభుత్వమే రైతులను మోసం చేయటం ఇది తొలి సారని వ్యాఖ్యానించిన పవన్..రాజధాని అంచెలంచెలుగా నిర్మించాలని సూచించారు. రాత్రికి రాత్రి రాజధాని నిర్మాణం జరిగిపోదన్నారు. కొందరు వ్యక్తుల మీద ఉన్న కోపం రైతుల మీద చూపించవద్దన్నారు. కొన్ని ప్రాంతాలకే ముఖ్యమంత్రి వ్యవహరించకూడదని..151 మంది ఎమ్మెల్యేలు అన్ని ప్రాంతాల నుండి గెలిచారని గుర్తు చేసారు. అవినీతి చేసిఉంటే వారి మీద చర్యలు తీసుకోవాల ని ..తాము సంతోషిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం క్లారిటీ ఇస్తే..కార్యాచరణ ప్రకటిస్తా..
ప్రభుత్వం రాజధాని అంశం మీద స్పష్టత ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు. రాజధాని ఎక్కడో ప్రకటించాలని సూచించారు. విశాఖలోనా..కర్నూలు లోనా ఎక్కడ పెడతారో చెప్పాలన్నారు. ఆ తరువాతనే తాను తన కార్యాచరణ ఖరారు చేస్తానని స్పష్టం చేసారు. సాధ్యం కాని హామీలతో అటు ఉత్తరాంధ్ర..సీమ ప్రజలను సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా అని పవన్ ప్రశ్నించారు. అదే విధంగా విజయనగరంలో అసెంబ్లీ కోరితే..విశాఖలో పెడతామని చెబుతన్నారన్నారు. అమరావతి ప్రాంత వైసీపీ నేతలు రైతులకు మద్దతుగా నిలవకపోవటం పైన పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తామని చెబుతన్న ముఖ్యమంత్రి..ఇదే జిల్లాలో పల్నాడులో ఉన్న సరస్వతి పవర్ ప్రాజెక్టును కూడా తరలిస్తారా అని నిలదీసారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా.. అమరావతి రైతులకు న్యాయం చేయకుండా ముందుకు కదిలితే సహంచేది లేదని తేల్చి చెప్పారు. తాను మభ్య పెట్టి ఓట్లు వేయించుకోనని..నమ్మకం కలిగించే ఓట్లు వేయంచుకొనేందుకు ప్రయత్నిస్తానని వివరించారు.
అధికారం శాశ్వతం కాదు..ఎప్పుడైనా కూలిపోవచ్చు..
వైసీపీకి రాష్ట్రంలో సుస్థిరత కోసం అన్ని ప్రాంతాల ప్రజలు 151 సీట్లిచ్చి గెలిపించారని పవన్ గుర్తు చేసారు. మాట తప్పి..ధర్మం పాటించకుండా పాలన చేయటం సరి కాదన్నారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అంతకు ముందు స్థానిక రైతులతో కలిసి పవన్ ధర్నాలో పాల్గొన్నారు. స్థానిక మహిళలు పవన్ కు తమకు అండగా నిలవాలని అభ్యర్ధించా రు. జగన్ పాలన తమకు వద్దని..పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరారు. రాజధాని తరలిస్తే తాము ప్రాణ త్యాగాలకైనా సిద్దమని పవన్ సమక్షంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాజధాని ఎక్కడున్నా.. రైతులకు మాత్రం న్యాయం జరగకుండా అడుగు ముందుకేసినా సహించేది లేదని..అమరావతి కంటే రైతుల గురించే జనసేన ఆందోళన చెందుతుందని పవన్ స్పష్టం చేసారు.