విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్-కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ- చర్చలపై ఉత్కంఠ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ప్రధాని మోడీ టూర్ లో భాగంగా ఆయన్ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో పవన్ సాయంత్రం విశాఖ వచ్చారు.
కాసేపట్లో విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీతో ఈ రాత్రికి పవన్ భేటీ కానున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ పది నిమిషాల పాటు భేటీ అయ్యేలా అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ పది నిమిషాల వ్యవధిలో వీరిద్దరి మధ్య జరిగే చర్చలు కీలకంగా మారాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీతో పవన్ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రధాని మోడీతో చర్చల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై పోరాటం కోసం బీజేపీని కోరిన రోడ్ మ్యాప్ లభిస్తుందా, లేక మరోమారు చర్చలు ఉంటాయా అన్నది తేలిపోనుంది. అలాగే టీడీపీకి జనసేన దగ్గరవుతున్న నేపథ్యంలో బీజేపీ-జనసేన మాత్రమే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేక టీడీపీని కూడా కలుపుకుని పోటీ చేస్తాయా అన్నది తేలబోతోంది. ఈ భేటీలో ప్రధాని స్పందన ఆధారంగా పవన్ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండటంతో వైసీపీతో పాటు విపక్ష పార్టీలు కూడా ఈ భేటీని ఆసక్తికరంగా గమనించబోతున్నాయి.