పవన్ కల్యాణ్కు తెలియదా: చంద్రబాబు అలా ఉంటే ఎంపీలేం చేస్తారు?
విజయవాడ: ప్రత్యేక హోదాపై జనసేన అధినేత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వదిలేసి పార్లమెంటు సభ్యులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒంటికి కారం రాసుకుని, కారం నీళ్లు తాగి పార్లమెంటులో పోరాడాలని ఆయన చాలా ఆవేశంగా ఎంపీలను ఉద్దేశించి అన్నారు. చాలా ఆవేశపూరితంగా ఆయన చెప్పిన డైలాగులకు మురిసిపోయినవారు చాలా మందే ఉంటారు.
అయితే, పవన్ కల్యాణ్ మాటల్లో హేతుబద్దత లోపించిందనే విషయం గురించి ఎవరూ ఆలోచించినట్లు లేదు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు నడుచుకుంటారు. తెలుగుదేశం పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ పార్టీ అధినేతదే అంతిమ నిర్ణయమవుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత చెప్పకుండా ఆ పార్టీ ఎంపీలు పోరాటం చేయడానికి ఏ మాత్రం వీలు కాదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించినట్లు లేరు.

చంద్రబాబు అవకాశం ఇస్తే పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని గతంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ అన్నారు. ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చాలా సార్లు బహిరంగంగానే చాలా వ్యాఖ్యలు చేశారు. జెసి దివాకర్ రెడ్డికి చంద్రబాబు విషయంలో ఉన్న ధీమా వేరే కాబట్టి ఆయన ఆ మాత్రం స్వేచ్ఛనైనా తీసుకుని మాట్లాడారు.
మురళీమోహన్ గానీ, ఇతర తెలుగుదేశం పార్టీ ఎంపీలు గానీ చంద్రబాబు చెప్పన వలయంలోనే తిరగాల్సి ఉంటుంది. ఆయన ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు గీసిన లక్ష్మణరేఖను దాటడానికి వీలు లేదు. దాటితే ఏమవుతుందనేది అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్కు తెలియదని అనుకోవాలా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఆశోక్ గజపతి రాజు గానీ సుజనా చౌదరి గానీ బయటకు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరనే విషయం పవన్ కల్యాణ్కు తెలిసే ఉండాలి. చంద్రబాబు కేంద్రాన్ని నొప్పించకూడదని ఆదేశించినప్పుడు ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా అదే పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ఆదేశించకుండానే సుజనా చౌదరి ఢిల్లీలో ప్రత్యేక ప్యాకేజీ కోసం అరుణ్ జైట్లీతోనూ వెంకయ్య నాయుడితోనూ కలిసి పనిచేశారని అనుకోవడం రాజకీయం గురించి తెలియకపోవడమేనని అనుకోవాలి.












Click it and Unblock the Notifications