పొత్తులపై తేల్చేసిన పవన్ : ఇప్పటి దాకా తగ్గాను - ఇక తగ్గాల్సింది టీడీపీనే : మూడే ఆప్షన్లు..!!
ఏపీలో కొంత కాలంగా జరుగుతున్న రాజకీయ పొత్తుల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా తేల్చి చెప్పారు. తాను ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చి..ప్రజలను గెలిపించానన్నారు. పార్టీ సమావేశంలో ఆయన పొత్తుల గురించి మాట్లాడుతూ...2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి ప్రజల కోసమే పని చేసానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తగ్గే ఒక స్టేట్ మెంట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. కానీ, 2024 ఎన్నికల్లో మాత్రం ఒక తగ్గేది ఉండదని తేల్చి చెప్పారు. తాను సీఎం అభ్యర్ధినని బీజేపీ నేతలు ఎవరూ తనకు చెప్పలేదన్నారు. జనసేన వద్ద వచ్చే ఎన్నికల్లో మూడు ప్రత్యామ్నాయాలేనని స్పష్టం చేసారు.

పవన్ నోట మూడు ప్రయత్నామ్నాయాలు
అందులో ఒకటి బీజేపీ - టీడీపీ - జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం. రెండోది టీడీపీ - జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించటం. మూడోది జనసేన ఒంటరిగా అధికారంలోకి రావటమని తేల్చి చెప్పారు. పొత్తుల విషయంలో తానే కాదని..టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని విస్పష్టంగా చెప్పారు. అదే సమయంలో తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అనే బైబిల్ సూక్తి నమ్ముతానంటూ పవన్ ప్రస్తావించారు. పవన్ వ్యాఖ్యల ద్వారా పదవులతో పాటుగా..సీట్ల విషయంలోనూ టీడీపీకి ఈ సూచన చేసినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీతో సంబంధాల పైన మాట్లాడుతూ...కరోనా కారణంగా తమ రెండు పార్టీల మధ్య సోషల్ డిస్టన్స్ వచ్చిందని వ్యాఖ్యానించారు.

వైసీపీ గోదావరి జిల్లాలను మర్చిపోవాల్సిందే
వైసీపీ కొన్ని వర్గాలను వర్గ శత్రువులుగా చూస్తూ వారిని దూరం చేసుకుందని...ఇతర వర్గాలు వీైసీపీని దూరంగా ఉంచుతున్నాయని పవన్ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. కోనసీమ జిల్లా పేరు మార్పు కారణంగా పరిస్థితి సున్నింతంగా మారిందనే సమాచారం ప్రభుత్వానికి ముందే ఉందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే అక్కడ వైసీపీలోని రెండు వర్గాలు విధ్వంసానికి పాల్పడ్డాయని.. ప్రభుత్వంలోని పెద్దలు వారిని ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ వివాదంతో జనసేనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సమాచారం ఉన్నా బలగాల మొహరింపు...ఫైరింజన్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కోనసీమలో అన్ని వర్గాల మధ్య ఐక్యత కోసం పార్టీ నేతలు ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

అన్ని వర్గాలు వైసీపీకి దూరమయ్యాయి
అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని..కమ్మ వర్గాన్ని వర్గ శత్రువుగా భావించిందని పేర్కొన్నారు. కమ్మ వర్గాన్ని తిట్టాల్సిందంతా తిట్టి.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అవన్నీ మర్చిపోతారా అంటూ ప్రశ్నించారు. జనసేనకు మద్దతుగా ఉంటున్నారనే కారణంగా కాపు వర్గాన్ని సైతం వర్గ శత్రువుగా చూస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజలను సైతం ఇబ్బంది పెడుతున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు. కోనసీమ అల్లర్లను కుల ఘర్షణగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితుల పైన తాను బీజేపీ కేంద్ర నేతలకు వివరించానని పవన్ వెల్లడించారు. అవినీతి కామన్ అనుకొనే పరిస్థితి వచ్చిందని... అవినీతికి పాల్పడే వ్యక్తే ఏసీబీని తన నియంత్రణలో ఉంచుకుంటూ..యాప్ లు ఆవిష్కరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేసారు. జగన్ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అందరికీ ఒకే సామాజిక వర్గమని పవన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications