ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ సీరియస్..! సమన్ల జారీకి ఆదేశం..!
రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్స్ (Andhra Paper Mills) పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కన్నెర్ర చేశారు. ఓవైపు పన్నులు ఎగ్గొడుతూ, మరోవైపు ఇష్టారాజ్యంగా కాలుష్యం వెదజల్లుతున్న ఈ పరిశ్రమకు నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినా పట్టించుకోకపోవడంతో పవన్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకునేలా కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు ఇచ్చారు. తక్షణం సమన్లు జారీ చేయాలని పవన్ ఆదేశించారు.
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోందని, యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారని, పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారని పవన్ ఆక్షేపించారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా? ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు.

రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయని, నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, మీరొక్కరే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యిందన్నారు. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉందన్నారు. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికమన్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదన్నారు.
మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చని, పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చని, పెనాల్టీలు విధించవచ్చని, కంపెనీని సీజ్ చేయొచ్చని, ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్చని, అయినా పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిందన్నారు. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారని, అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడిందన్నవారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రభుత్వం తరఫున లీగల్ టీమ్ ఈ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications