ఢిల్లీకి జనసేనాని... ఆ వ్యూహాలకు పదును పెట్టేందుకేనా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో కలిసి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల పొత్తు,సీట్ల సమన్వయంపై ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో గెలుపును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ఆయన ఎలాంటి వ్యూహాలపై చర్చించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలు.. అంది వచ్చిన అవకాశం..
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఏకఛత్రాధిపత్యం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అధికార పక్షం హవాకు చెక్ పెట్టి వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలంటే జనసేన,బీజేపీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం తప్పనిసరి. కాబట్టి ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహాలపై పకడ్బందీగా వ్యవహరించాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిన రెండు పార్టీలు.. స్థానిక సంస్థల ఎన్నికలను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటగలిగితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నాయి.

జనసేనకు అగ్నిపరీక్షే..
2104 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,జనసేనలతో పొత్తు ద్వారా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన వల్లే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని ఆ పార్టీ నాయకులు పలుమార్లు చెప్పారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ తప్ప బీజేపీ,జనసేన ఎక్కడా కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. కారణం.. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో సరైన నిర్మాణం,ప్రత్యేకించి ఏ సామాజికవర్గం వారి వెంట లేకపోవడం. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు అంతే బలహీనంగా ఉన్నాయన్న వాదన కూడా ఉంది. ఆ వాదన సరికాదని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటి తాము పుంజుకుంటున్నామన్న సంకేతాలు ఇవ్వాలి. కాబట్టి ఒకవిధంగా క్షేత్రస్థాయిలో జనసేన బలాబలాలకు ఇదో అగ్ని పరీక్షే.
Recommended Video


సవాళ్లను ఎలా ఎదుర్కొనబోతున్నారు..
టీడీపీ,జనసేనలకు సరైన కేడర్ లేని నేపథ్యంలోనే ఇటీవల కొంతమంది జనసేన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రతిపాదించారన్న కథనాలు వచ్చాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ దాన్నో అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ,వైసీపీలకు సమదూరం పాటిస్తున్నట్టు జనసేనాని చెబుతున్నా.. ఆయన చంద్రబాబు తొత్తు అంటూ వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఈ ఇద్దరు మళ్లీ ఒక్కటైతే.. పవన్ కల్యాణ్ చంద్రబాబు మనిషి అని వైసీపీ మళ్లీ ప్రచారం చేస్తుంది. అంతకుమించి టీడీపీతో పొత్తును బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటారన్నది పవన్ ముందున్న సవాల్. ఇప్పటికైతే బీజేపీ,జనసేనలకు క్షేత్ర స్థాయిలో చెప్పుకోదగ్గ కేడర్ లేదు. దాన్ని అధిగమించి సత్తా చాటాలంటే కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. తాజా ఢిల్లీ టూర్లో పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో దాని పైనే చర్చించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications