ఆర్టీఐ వినియోగించండి: పవన్ కళ్యాణ్ కోసం ముందుకొచ్చిన ఫ్యాన్స్
విశాఖ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ బలోపేతానికి అభిమానులంతా కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు శివప్రసాద్, రాఘవరావు, సతీష్ కుమార్ ఆదివారం కోరారు. విశాఖలోని శివాజీ పార్కులో నగర స్థాయి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు అండగా ఉంటామని అభిమానులు చెప్పారు. జనసేన పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకుగాను విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలను నిర్వహించాలని నిర్వహించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 300 మందికి పైగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. సుమారు ఆరుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావ సభలను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ... వార్డులో కనీసం పదిమంది యువకులు ముందుకు వచ్చి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అవసరమైతే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడి పనిచేసే నాయకులు ముందుకు రావాలన్నారు. వృత్తిని కొనసాగిస్తూనే, పలువురికి సహాయం అందించటం ద్వారా పార్టీని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
మార్చి 14న జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. కాగా, జనసేన పార్టీని స్థాపించి రెండేళ్లు కావస్తోంది. జాతీయ సమైక్యత, ప్రజాధనం వ్యయానికి కాపలా, బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన మొదలైనవి జనసేన పార్టీ లక్ష్యాలుగా ఉన్నాయి.