ఏపీ పునర్ వైభవానికి తొలి అడుగులు: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ(టీడీపీ, జనసేన, బీజేపీ) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ప్రజలను ఆందోళనలకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. మరోవైపు, 2024 ఎన్నికల ప్రచారంలో పింఛన్ను 4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతేగాక, ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛన్ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్ 4 వేలు, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం రూ. 3 వేలు కలిపి రూ. 7 వేల పింఛన్ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు 4 వేల రూపాయల పింఛన్ అందనుంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 31 కోట్లు ఖర్చుచేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేయించారు. ఈ నేపత్యంలో అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు.
యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. సీఎం చంద్రబాబు ఐదో సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టారు. మరోవైపు, మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
హామీల అమలు మొదలైంది..
16,347 ఉపాధ్యాయ పోస్టులను డిసెంబర్ 31 నాటికల్లా భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తమ ఎన్డీఏ ప్రభుత్వం హామీల అమలును ప్రారంభించిందంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
'ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది. 1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద - తొలి సంతకం. 2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం. 3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ - మూడో సంతకం. 4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం. 5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - ఐదో సంతకం చేశారు.
ఇలా సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications